సోనియా గాంధీకి నెత్తుటి లేఖ - కొత్త అధ్యక్షుడు ఖాయం - 7గంటల సీడబ్ల్యూసీలో కీలక నిర్ణయాలు
ఇటీవలి కాలంలో కనీవినీ ఎరుగని స్థాయిలో కాంగ్రెస్ పార్టీ వార్తలు పతాక శీర్షికలకెక్కాయి. సోమవారం నాటి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ)లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకోవడంతో అసలు అజెండా పక్కదారి పట్టినట్లయింది. అయితే, ఏడు గంటలపాటు సుదీర్ఘంగా సాగిన భేటీలో ఎట్టకేలకు హైకమాండ్ కీలక నిర్ణయాలు తీసుకోగలిగింది. మరోవైపు గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తినే సారధిగా కొనసాగించాలంటూ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలు చేయడం, ఢిల్లీకి చెందిన ఓ కౌన్సిలర్ ఏకంగా రక్తంతో సోనియా గాంధీకి లేఖ రాయడం లాంటి ఆసక్తికర ఘటనలూ జరిగాయి.
Recommended Video
ఆజాద్.. 45 ఏళ్ల గులాంగిరీకి ఇదా బహుమానం? ముస్లిం కాబట్టేగా - అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
సోనియా డెడ్లైన్..
పార్టీ సమూల ప్రక్షాళన, కొత్త నాయకుడి ఎంపిన అంశాలే ప్రధాన అజెండాగా సీడబ్ల్యూసీ సోమవారం సమావేశమైంది. అయితే, ఇవే అంశాలను ప్రస్తావిస్తూ పార్టీకి చెందిన 23 మంది సీనియర్లు సోనియాకు ఆదివారం ఘాటు లేఖ రాయడం, ఆ లేఖపై సంతకాలు చేసినవాళ్లలో ముగ్గురు సీడబ్ల్యూసీ మెంబర్లు కూడా ఉండటంతో సమావేశంలో లేఖపై చర్చ జరిగింది. దీంతో అసలు అంశం దాదాపు పక్కదారి పట్టినంత పనైంది. మీడియాలోనూ ఈ గొడవకు సంబంధించిన వార్తలు రావడంతో నేతలు క్లారిటీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఎట్టకేలకు తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగేందుకు అంగీకరించిన సోనియా గాంధీ.. అందుకు డెడ్ లైన్ కూడా విధించినట్లు తెలిసింది.
కొత్త చీఫ్ ఖాయం.. ఎంపిక ఎలా?
ఏడు గంటలపాటు సుదీర్ఘంగా సాగిన సమావేశంలో కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక మండలి సీడబ్ల్యూసీ కీలక నిర్ణయాలు తీసుకుంది. సోనియా గాంధీ విధించిన డెడ్ లైన్ కు అనుగుణంగా కొత్త చీఫ్ ను ఎంపిక చేయాలని డిసైడ్ అయింది. ఈ ప్రక్రియను ఆరు నెలల వ్యవధిలోనే చేపట్టాలని నిర్ణయించారు. అయితే కొత్త చీఫ్ ఎంపిక ఎన్నికల ద్వారా చేపడతారా? లేక ఏకాభిప్రాయంతోనా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. అయితే సోమవారం దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న పరిణామాలు కొత్త చీఫ్ ఎంపికను మరింత జఠిలంగా మార్చాయి.
CWCలో ఊహించిన ట్విస్ట్: సారధిగా సోనియా గాంధీ కొనసాగింపు - నేతల ఒత్తిడి వల్లే?
సోనియాకు నెత్తుటి లేఖ..
అటు సీడబ్ల్యూసీ సమావేశం జరుగుతుండగానే.. ఢిల్లీ కంటోన్మెంట్ కు చెందిన సందీప్ తన్వర్ అనే కౌన్సిలర్.. అధినేత్రి సోనియాకు రక్తంతో లేఖ రాయడం సంచలనంగా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీని ధీటుగా ఎదుర్కొనే సత్తా రాహుల్ గాంధీకి మాత్రమే ఉందని, ఆయనే అధ్యక్షుడిగా ప్రకటించాలని, ఇప్పటికే రాహుల్ పేద ప్రజల మన్ననలు పొందారని, పార్లమెంటులోనూ ప్రజల పక్షాన పోరాడుతున్నారని, రాహుల్ ను కాకుండా వేరే వ్యక్తిని చీఫ్ గా నియమిస్తే పార్టీకి మరిన్ని ఇబ్బందు తప్పవని తన్వర్ తన నెత్తుటి లేఖలో పేర్కొన్నారు.
ఏకాభిప్రాయం సాధ్యమేనా?
135 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ గడిచిన అరదశాబ్ద కాలంగా తీవ్రమైన ఒడిదొడుకులు ఎదుర్కొంటుండటం, వరుసగా రెండు సార్వత్రిక ఎన్నికల్లోనూ దెబ్బ తినడం తెలిసిందే. 2019 లోక్ సభ ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ పార్టీ చీఫ్ పదవి నుంచి వైదొలిగారు. కొత్త నాయకుణ్ని ఎన్నుకునే వరకు తాత్కాలిక చీఫ్ బాధ్యతల్ని సోనియా చేపట్టారు. ఇది జరిగి ఏడాది పూర్తయినా కొత్త సారధి ఎంపిక ప్రక్రియ ఎంతకూ ముదుకు కదల్లేదు. దీంతో ఆమెనే పూర్తిస్థాయిలో బాధ్యతలు తీసుకోవాలనే డిమాండ్ కూడా వ్యక్తమైంది.
ఈలోపు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు.. ‘గాంధీయేతర కుటుంబానికి చెందిన వ్యక్తినే అధ్యక్షుడిగా నియమించాలని' పట్టుపట్టారు. కానీ ఈ ప్రతిపాదనను నేతలుగానీ, దేశవ్యాప్తంగా ఉన్న శ్రేణులుగానీ వ్యతిరేకించారు. పలు పీసీసీలు, సీఎంలు, ప్రస్తుత ఎంపీ, ఎమ్మెల్యేలు, సాధారణ కార్యక్తలు.. గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తే సారధిగా ఉండాలంటూ రిప్రెజెంటేషన్లు పంపారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఏకాభిప్రాయంతో గాంధీయేతర వ్యక్తిని కాంగ్రెస్ చీఫ్ గా ఎన్నుకోవడం సాధ్యమేనా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.