అంతా ఒకే కుటుంబమన్న సోనియా - లేఖపై కక్ష లేదు - గీత దాటితే వేటే - కాంగ్రెస్ సీడబ్ల్యూసీ నిర్ణయాలివే
నాయకత్వ మార్పు, పార్టీ ప్రక్షాళన అంశాలే ప్రధాన అజెండాగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సుదీర్ఘంగా ఏడు గంటలపాటు భేటీ అయింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేపట్టిన ఈ సమావేశంలో సోనియాకు సీనియర్లు లేఖ రాసిన అంశంపై తీవ్రస్థాయిలో విభేదాలు వ్యక్తమయ్యాయి. అయితే, ఏది ఏమైనా అందరూ కాంగ్రెస్ కుటుంబ సభ్యులేనని, గీత దాటినవాళ్లపై మాత్రం వేటు తప్పదని పార్టీ పేర్కొంది.
సీడబ్ల్యూసీ సమావేశం వివరాలను కాంగ్రెస్ అధికార ప్రతినిధులు రణదీప్ సుర్జేవాలా, కేసీ వేణుగోపాల్ మీడియాకు వివరించారు. విభేదాల సంగతి ఎలా ఉన్నా అంతా ఒకే కుటుంబమని సోనియా చెప్పారని, అయితే పార్టీకి నష్టం చేసేవాళ్లను మాత్రం ఉపేక్షించబోమని నేతలు తెలిపారు. పార్టీ హైకమాండ్ ను ఎవరూ తక్కువగా చూడరాదని కేసీ వేణుగోపాల్ హెచ్చరించారు. సోనియా, రాహుల్ గాంధీల నాయకత్వాన్ని బలోపేతం చేయాలని సీడబ్ల్యూసీ నిర్ణయించిందని పేర్కొన్నారు.
సోనియా గాంధీకి నెత్తుటి లేఖ - కొత్త అధ్యక్షుడు ఖాయం - 7గంటల సీడబ్ల్యూసీలో కీలక నిర్ణయాలు
తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ కొనసాగాలన్న నిర్ణయం ఏకగ్రీవంగా తీసుకున్నామని స్పష్టం చేశారు. పార్టీ అంతర్గత వ్యవహారాలకు సంబంధించిన అంశాలను మీడియా ముందు చర్చించరాదని నిర్ణయించుకున్నామని, ఈ నిబంధన మీరే వాళ్లపై చర్యలు తీసుకుంటామని వేణుగోపాల్, సుర్జేవాలా చెప్పారు. మిగతా పార్టీలకు భిన్నంగా కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం ఉందని, నేతలు ఎవరైనా తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించొచ్చని, అయితే, పార్టీ వేదికపై కాకుండా బయట మాట్లాడటం తగదని పీఎల్ పునియా తెలిపారు.
CWCలో ఊహించిన ట్విస్ట్: సారధిగా సోనియా గాంధీ కొనసాగింపు - నేతల ఒత్తిడి వల్లే?
ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులపై సోనియా గాంధీ సహా సీడబ్ల్యూసీ ఆందోళన వ్యక్తం చేసిందని, కరోనా కట్టడిలో, చైనాను నిలువరించడంలో, ఎకానమీని కాపాడటంలో బీజేపీ సర్కార్ దారుణంగా విఫలైమైందని, ఈ మేరకు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా వ్యవహరించాలని నిర్ణయించినట్లు నేతలు తెలిపారు. కొత్త అధ్యక్షుడి ఎంపిక, సంస్థాగత మార్పులపై పూర్తి నిర్ణయాధికారం పార్టీ అధ్యక్షురాలికి ఉంటుందని క్లారిటీ ఇచ్చారు.
కాగా, 23 మంది సీనియర్ల లేఖ ఉంతం పార్టీని కుదిపేసిన విషయాన్ని రణదీప్ సుర్జేవాలా అంగీకరించారు. అయితే, లేఖ రాసిన నేతల పట్ల అధినేత్రికి ఎలాంటి దురుద్దేశం, కక్షపూరిత ఆలోచనలు లేవని, అంతా ఒకే కుటుంబంగా ఉందామని ఆమె స్వయంగా చెప్పారని సుర్జేవాలా తెలిపారు. ఇంత పెద్ద కాంగ్రస్ కుటుంబంలో అప్పుడప్పుడూ అభిప్రాయ బేధాలు రావడం సహజమేనని, ఎవరు ఏది మాట్లాడినా అంతిమంగా ప్రజలు, పార్టీ శ్రేణులకు మంచి జరగాలన్న ఉద్దేశమే ఉంటుందని సోనియా వ్యాఖ్యానించినట్లు సుర్జేవాలా వివరించారు.