ఆజాద్.. 45 ఏళ్ల గులాంగిరీకి ఇదా బహుమానం? ముస్లిం కాబట్టేగా - అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి 'కాంగ్రెస్ వర్కింగ్ కమిలీ(సీడబ్ల్యూసీ)లో చోటుచేసుకున్నట్లుగా చెబుతోన్న పరిణామాలు రాజకీయంగా పెనుదుమారం రేపుతున్నాయి. పార్టీలో నాయకత్వ మార్పు, ప్రక్షాళనపై అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాసిన కాంగ్రెస్ సీనియర్లు బీజేపీతో కుమ్మక్కయ్యారని రాహుల్ గాంధీ ఆరోపించారని వ్యార్తలు రావడంతో మిగతా పార్టీలు ఒక్కొక్కటిగా స్పందిస్తున్నాయి. ఈ క్రమంలో మజ్లిస్ నేత మొదటి విమర్శ బాంబు విసిరారు.
Recommended Video
cwc: కపిల్ సిబల్ అంతరిక్ష పల్టీ - నిమిషాల్లోనే ట్వీట్ డిలిట్ - రాహుల్ ఆ మాట అనలేదట
రాజీనామా చేస్తానన్న ఆజాద్..
సోనియాకు లేఖ విషయంలో కాంగ్రెస్ సీనియర్ల తీరును తప్పు పట్టిన రాహుల్ గాంధీ.. ప్రధానంగా గులాం నబీ ఆజాద్ ను టార్గెట్ చేసి మాట్లాడారు. అసమ్మతి పేరుతో కార్యకలాపాలకు పాడుతోన్న కొందరు బీజేపీతో మిలాకత్ అయినట్లుగా అనిపిస్తోందంటూ రాహుల్ నేరుగా ఆజాద్ ను ఉద్దేశించి అన్నారని వార్తలు వచ్చాయి. దీనికి తీవ్రంగా నొచ్చుకున్న ఆజాద్.. ఒక్క ఆధారం చూపించినా ఈ మీటింగ్ లోనే రాజీనామా చేస్తానని ఘాటుగా రిప్లై ఇచ్చారు. ఇలాంటి ఆరోపణలే చేసిన కపిల్ సిబల్ కాసేపటికి ట్వీట్ డిలిట్ చేసి, అధిష్టానానికి విధేయత చాటుకున్నారు. కానీ ఆజాద్ మాత్రం రాజీనామా వ్యాఖ్యలకే కట్టుబడి ఉంటానని చెబుతుండటం గమనార్హం. మరోవైపు..
గులాం నబీనే టార్గెట్..
ప్రియాంక గాంధీ కూడా గులాం నబీ ఆజాద్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని, లేఖలో పేర్కొన్న అంశాలకు, మీటింగ్ లో ప్రస్తావనలకు పొంతన లేకపోవడంతో ఆమె అసహనానికి గురయ్యారని రిపోర్టులు వచ్చాయి. అసలు లేఖ ఎపిసోడ్ కు అజాదే డైరెక్షన్ చేశారని కూడా ఆరోపణలున్నాయనే వార్తలు వచ్చాయి. మొత్తంగా సీడబ్ల్యూసీ మీటింగ్ లో గులాం నబీ ఆజాద్ ను టార్గెట్ చేయడంపై ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ వలలో సోనియా విధేయులు - రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు - ఆజాద్, సిబల్ రాజీనామాకు..
చేసుకున్నోళ్లకు చేసుకున్నంత..
‘‘డియర్ ఆజాద్.. చేసుకున్నళ్లకు చేసుకున్నంత అంటే ఇదేనేమో! నాపై మీరు ఎలాంటి ఆరోపణలైతే చేస్తారో.. సరిగ్గా ఆ ఆరోపణలే ఇప్పుడు మీపై వచ్చాయి. నన్ను బీజేపీకి బీ-టీమ్ అని మీరు తిడతారు. ఇవాళ మీ పార్టీవాళ్లే మిమ్మల్ని బీజేపీతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. నిజమే, హిందూత్వ నాయకత్వాన్ని ప్రశ్నించే ఎవరైనా బీ-టీమ్ గా ముద్రపడాల్సిందేమో''అని ఓవైసీ ఎద్దేవా చేశారు.
గులాంగిరీకి బహుమానం..
కాంగ్రెస్ పార్టీలో 45 ఏళ్ల పాటుసేవలు చేసిన గులాం నబీ ఆజాద్ పై కుమ్మక్కు ఆరోపణలు రావడం అనూహ్యమేమీ కాదని, కాంగ్రెస్ పార్టీకి లాయల్ గా ఉన్నందుకు ముస్లింలు తగిన మూల్యం చెల్లించుకుంటున్న సందర్భమిదని అసదుద్దీన్ వ్యాఖ్యానించారు. ‘‘ఆజాద్.. 45 ఏళ్ల గులాంగిరీకి ఇదా మీకు దక్కిన బహుమానం?'' అని ప్రశ్నించారు. ముస్లింలకు బీజేపీ కంటే ఎక్కువ ద్రోహం కాంగ్రెస్ పార్టీనే చేసిందని పదే పదే ఆరోపించే మజ్లిస్ చీఫ్ ఆజాద్ ఎపిసోడ్ తో తన వాదనకు బలం చేకూరిందన్నారు.