బీజేపీ వలలో సోనియా విధేయులు - రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు - ఆజాద్, సిబల్ రాజీనామాకు..
135 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఎన్నడూ కనీ, వినీ ఎరుగని సంచలనాలు చోటుచేసుకున్నాయి. ఎన్నికల్లో వరుస ఓటములతో దాదాపు క్షీణదశకు చేరిన పార్టీలో అధినేత్రి సోనియా గాంధీకి 23 మంది సీనియర్లు రాసిన లేఖ ప్రకంపనలు సృష్టిస్తోంది. సోనియాకు అత్యంత విధేయులుగా ఉన్న ఆ సీనియర్లు బీజేపీ వలలో చిక్కుకున్నారని, కమలనాథుల కుట్రల్లో పావులుగా మారారనే అంశం తెరపైకి వచ్చింది. ఇవేవో మీడియా ఊహాగానాలు, పండితుల విశ్లేషణలు కావు. సాక్ష్యాత్తూ రాహుల్ గాంధీ స్వయంగా అన్న మాటలు.
కాంగ్రెస్ చీఫ్ పోస్టు నుంచి తప్పుకుంటా - సీనియర్ల లేఖకు సోనియా గాంధీ రిప్లై - సీడబ్ల్యూసీపై టెన్షన్
సీడబ్ల్యూసీలో సంచలనాలు..
కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అత్యున్నత నిర్ణయాత్మక మండలి ‘కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ)' సోమవారం సమావేశమైంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన భేటీలో అనూహ్య పరిణామాలు, సంచలనాలు చోటుచేసుకున్నాయి. పార్టీకి సమర్థవంతమైన నాయకత్వం ఉండాలని, కింది నుంచి పైదాకా ప్రక్షాళన చేయాలంటూ 23 మంది సీనియర్లు రాసిన లేఖపై రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. లేఖ విడుదలైన టైమింగ్ పైనా ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో నొచ్చుకున్న సీనియర్లు రాహుల్ పై ఎదురుదాడకి దిగారు. ఆరోపణలు నిరూపించకుంటే రాజీనామా చేస్తామని తెగేసి చెప్పారు.
బీజేపీతో సీనియర్ల మిలాఖత్
కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి గళాలు, భిన్నస్వరాలకు మొదటి నుంచీ చోటుందని, ప్రజాస్వామిక విధానంలో ఆ పద్ధతి మంచిదేనన్నారు రాహుల్ గాందీ. అయితే ఇటీవల కాలంలో అసమ్మతి నేతలంతా బీజేపీతో మిలాఖత్ అవుతున్నారని, సోనియా గాంధీకి 23 మంది సీనియర్ల లేఖ కూడా ఆ కుట్రలో భాగమే అయి ఉండొచ్చని ఆయన ఆరోపించారు. ‘‘అసమ్మతి పేరుతో బీజేపీ అనుకూల విధానాలు అవలంభిస్తున్నారు. లేఖ ఎపిసోడ్ నన్ను తీవ్రంగా బాధించింది''అని రాహుల్ వ్యాఖ్యానించారు.
టీడీపీ నుంచి చంద్రబాబు బహిష్కరణ - 1995 నాటి లేఖలో ఎన్టీఆర్ - సంచైత సంచలన ట్వీట్
రాహుల్ పై సీనియర్ల ఫైర్
మాజీ చీఫ్ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై సీనియర్లు సైతం అదే స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ, కౌంటర్ ఇచ్చారు. తాము బీజేపీతో కుమ్మకయ్యామనడానికి ఆధారాలుంటే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఏ చిన్న పాయింట్ చూపించినా తక్షణమే రాజీనామా చేస్తామంటూ గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్ సవాలు విసిరారు. తమను రాహుల్ గాంధీ ఎంత దారుణంగా అవమానించాడో సిబల్ స్వయంగా ట్విటర్ ద్వారా తెలియపర్చారు.
ఆజాద్, సిబల్ రాజీనామా..
‘‘30 ఏళ్ల రాజకీయ జీవితంలో మేము ఏనాడూ బీజేపీకి అనుకూలంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అలాంటిది మమ్మల్ని ‘‘బీజేపీతో కుమ్మకయ్యారు''అని రాహుల్ ఆరోపించారు. అవునుమరి, రాజస్థాన్ సంక్షోభంలో పార్టీ తరఫున న్యాయపోరాటం చేసి, మణిపూర్ లో పార్టీని కాపాడిన తర్వాత కూడా ఆయనిలా వ్యాఖ్యానించడం బాధాకరం. బీజేపీతో మేం కలిసిపోయామనడానికి ఒక్క ఆధారం చూపించినా వెంటనే రాజీనామాలు చేస్తాం''అని సిబల్ చెప్పగా, ఆజాద్ కూడా దాదాపు ఇదే టోన్ లో రియాక్ట్ అయ్యారు.