నిరుద్యోగులే టార్గెట్.. బ్యాంక్ అకౌంట్లను అద్దెకు తీసుకుని..
భిండ్ : అమాయకుల జేబులు గుల్ల చేయడమే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు బరి తెగిస్తున్నారు. నిరుద్యోగ యువతను టార్గెట్ చేసి వారిని తాము చేసి పాపపు పనికి పావులుగా వాడుకుంటున్నారు. ఉద్యోగం లేని యువకుల బ్యాంక్ అకౌంట్ను అద్దెకు తీసుకుంటున్న కేటుగాళ్లు తాము కొల్లగొట్టిన డబ్బును ఆ ఖాతాలకు మళ్లిస్తున్నారు. ఆ తర్వాత డబ్బును విత్ డ్రా చేసుకుని పత్తాలేకుండా పోతున్నారు. పోలీసుల దర్యాప్తులో అసలు అకౌంట్ హోల్డర్లు పట్టుబడుతుండటంతో ఖాతాలను అద్దెకిచ్చిన నిరుద్యోగులు లబోదిబోమంటున్నారు.
నిరుద్యోగులే టార్గెట్
మధ్యప్రదేశ్లోని భిండ్ జిల్లాలోని నిరుద్యోగ యువతే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు ఈ రాకెట్ నడుపుతున్నారు. ప్లాన్లో భాగంగా కేటుగాళ్లు ఉద్యోగం, ఉపాధిలేని యువతను ఎంచుకుంటున్నారు. వారితో కొత్తగా బ్యాంక్ ఖాతాలు తెరిపించి దాన్ని అద్దెకు తీసుకుంటున్నారు. ఒక్కో అకౌంట్కు నెలకు రూ.1200 నుంచి రూ.1300 చెల్లిస్తూ తమ అక్రమ సంపాదనను అందులో జమచేస్తున్నారు. ఇలా లక్షల రూపాయలు కొల్లగొడుతూ అమాయకులైన నిరుద్యోగులను కేసుల్లో ఇరికిస్తున్నారు.
బెంగళూరు మహిళ ఫిర్యాదుతో
సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్న బెంగళూరుకు చెందిన మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది. సదరు మహిళ నుంచి రూ.4లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు అందులో రూ.40వేలు మధ్యప్రదేశ్ భిండ్ జిల్లాలోని ఓ బ్యాంక్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. ఫిర్యాదులో మహిళ చెప్పిన విషయాల ఆధారంగా మధ్యప్రదేశ్ సైబర్ సెల్ పోలీసులు తీగలాగడంతో డొంక కదలింది. ఏడు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కొత్తగా ఓపెన్ చేసిన ఖాతాలను ఉపయోగించి సైబర్ క్రిమినల్స్ అక్రమాలకు పాల్పడుతున్నారని, అవన్నీ నిరుద్యోగ యువతకు చెందినవేనని గుర్తించారు. పోలీసులు గుర్తించిన బ్యాంకు అకౌంట్లలో మూడింటి నుంచి దాదాపు కోటి రూపాయల మేర లావాదేవీలు జరిగినట్లు దర్యాప్తులో తేలింది.
పోలీసుల అదుపులో అకౌంట్ హోల్డర్లు
బ్యాంకులు ఇచ్చిన సమాచారం మేరకు అకౌంట్ హోల్డర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని ప్రశ్నించగా.. నాలుగైదు నెలల క్రితం తాము బ్యాంక్ ఖాతా ఓపెన్ చేశామని ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి వాటిని అద్దెకు తీసుకుని నెలకు రూ.1200 నుంచి రూ.1300 వరకు ఇస్తున్నాడని చెప్పారు. అకౌంట్ తెరిచిన వెంటనే పాస్బుక్, డెబిట్ కార్డుతో పాటు బ్యాంక్ ఖాతాలో అనుసంధానమైన సిమ్ కార్డును సదరు వ్యక్తి తీసుకున్నాడని పోలీసులకు వివరించారు. దర్యాప్తులో భాగంగా సైబర్ క్రిమినల్స్ వాడుతున్న అకౌంట్లన్నింటినీ అధికారులు ఫ్రీజ్ చేశారు. ఈ రాకెట్ సూత్రధారులను పట్టుకునే పనిలో పడ్డారు.