లక్నో టు ఛత్తీస్ఘడ్.. సైకిల్పై బయలుదేరిన ఫ్యామిలీ.. మార్గమధ్యలోనే తీరని విషాదం..
కరోనా వైపరీత్యం వలస కూలీల బతుకును ఛిద్రం చేసింది. బతుకు తరిమితే పొట్టచేత పట్టుకుని నగరాలకు వెళ్లిన జనం.. కరోనా తరుముతుంటే తిరిగి గ్రామాలకు చేరుతున్నారు. ఆకలి పోరులో ఎటుపడితే అటు విసిరేసినట్టుగా తయారైన వారి జీవితాలు.. లాక్ డౌన్ ఆంక్షలతో మరింత చెల్లాచెదురయ్యాయి. 'బండి వద్దు.. బస్సు వద్దు.. ఇడిసిపెడితే నడిసిపోత అయ్య సారూ...' అంటూ ఇటీవల ఆదేశ్ రవి అనే కవి రాసిన పాట ఈ పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా.. తమ మొక్కవోని ధైర్యంతో కాలినడకనే వేలమంది వలస కూలీలు స్వస్థలాలకు పయనమయ్యారు. కానీ గమ్యం చేరకముందే ఎంతోమంది ప్రాణాలు విడుస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ నుంచి ఛత్తీస్ఘడ్కి సైకిల్ పైనే బయలుదేరిన ఓ జంట ఇలాగే ప్రాణాలు విడిచింది.
సైకిల్పై లక్నో నుంచి ఛత్తీస్ఘడ్..
ఉత్తరప్రదేశ్కి చెందిన కృష్ణ సాహు(45),అతని భార్య ప్రమీలా సాహు(38) లక్నోలోని సికిందరా ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. వీరికి చాందిని,నిఖిల్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన కృష్ణ సాహు.. భార్యాబిడ్డలను వెంటపెట్టుకుని సైకిల్ పైనే లక్నో నుంచి ఛత్తీస్ఘడ్కి బయలుదేరాడు. అయితే మార్గమధ్యలోనే విధి వారిని వెక్కిరించింది. అనుకోని రోడ్డు ప్రమాదంలో దంపతులిద్దరూ మృతి చెందారు.
మార్గమధ్యలో రోడ్డు ప్రమాదం.. భార్యాభర్తలు మృతి..
లక్నో నుంచి 25కి.మీ సైకిల్పై ప్రయాణించాక.. తెల్లవారుజామున 2.30గం. సమయంలో కృష్ణ ఫ్యామిలీ ప్రయాణిస్తున్న సైకిల్ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రమీలా సాహు అక్కడికక్కడే మృతి చెందగా.. కృష్ణ సాహు తీవ్ర గాయాలతో కింగ్ జార్జ్ మెడికల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వారి పిల్లలు చాందిని,నిఖిల్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రస్తుతం ఆ ఇద్దరు చిన్నారులు లక్నోలోని తమ బాబాయ్ రామ్ కుమార్ ఇంట్లో ఉన్నారు.
మృతుడి సోదరుడు ఏమంటున్నాడు..
'లక్నో నుంచి ఛత్తీస్ఘడ్ బయలుదేరే ముందు నా సోదరుడు నాతో ఏమీ చెప్పలేదు. లాక్ డౌన్ కారణంగా నిర్మాణ పనులన్నీ ఆగిపోవడంతో కొద్దిరోజులుగా పిల్లలకు తిండి పెట్టేందుకు తిప్పలు పడుతున్నాడు. వారం క్రితం నేను తనతో మాట్లాడినప్పుడు.. చేతిలో డబ్బులు లేవని చెప్పాడు. ఇప్పుడు నా సోదరుడి పిల్లలు నావద్దే ఉన్నారు. నిఖిల్ తల,కాళ్లపై స్వల్ప గాయాలయ్యాయి. చాందిని తలపై కూడా స్వల్ప గాయమైంది.' అని కృష్ణ సాహు సోదరుడు రామ్ కుమార్(38) తెలిపారు.
Recommended Video
పోలీసులు ఏమంటున్నారు..
సుశాంత్ గోల్ఫ్ సిటీ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ అజయ్ సింగ్ మాట్లాడుతూ.. గురువారం(మే 6) తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం వారి సైకిల్ను ఢీకొట్టిందని చెప్పారు. పోస్టుమార్టమ్ తర్వాత మృతదేహాలను రామ్ కుమార్కు అప్పగించామన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. శుక్రవారం(మే 8) తెల్లవారుజామున ఔరంగాబాద్కు సుమారు 30 కిలోమీటర్ల దూరంలోని కర్మద్లోపట్టాలపై నిద్రిస్తున్న 16 మంది వలస కూలీల ఘటన దేశాన్ని కలచివేసిన సంగతి తెలిసిందే. ఇంకా ఎంతోమంది వలస కూలీలు నగరాల నుంచి బయలుదేరి మార్గమధ్యలోనే ప్రాణాలు విడిచిన ఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. వలస జీవుల గోస చూసీ ఎన్నో గుండెలు తరుక్కుపోతున్నాయి.