సూపర్ సైక్లోన్ ఎంఫాన్: మూడు రాష్ట్రాలు గజగజ: ఏపీ సహా: ప్రధాని అత్యవసర భేటీ: ఆ జిల్లాల్లో
న్యూఢిల్లీ: బంగాళాఖాతంలో ఆగ్నేయ దిశగా ఏర్పడిన ఎంఫాన్ (Amphan) తుఫాన్ సూపర్ సైక్లోన్గా రూపాంతరం చెందింది. తీర ప్రాంతాలపై విరుచుకుపడబోతోంది. మన రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర సహా మూడు రాష్ట్రాలను గజగజమంటూ వణికిస్తోంది. ఊహించిన దాని కంటే ఈ తుఫాన్ తీవ్రత అధికంగా ఉందని, పెను విధ్వంసాన్ని సృష్టించడం ఖాయంగా కనిపిస్తోందని భారత వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అంచనాలకు మించి ఈ తుఫాన్ బలోపేతమైందని వెల్లడించారు. దీనికి ఇదివరకు ఆంఫన్ (Umpun)గా పేరుపెట్టారు.
Recommended Video
సాయంత్రం 4 గంటలకు ప్రధాని అత్యవసర భేటీ..
తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ఈ సాయంత్రం 4 గంటలకు అత్యవసర సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ఆ శాఖ ఉన్నతాధికారులు, జాతీయ విపత్తు నిర్వహణ (ఎన్డీఆర్ఎఫ్) విభాగం అధికారులు ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించే అవకాశాలు లేకపోలేదు.
190 కిలోమీటర్ల వేగంతో..
బంగాళాఖాతానికి ఆగ్నేయ దిశగా ఏర్పడిన ఈ తుఫాన్ ప్రభావం వల్ల ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, గంటకు 190 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఏపీలోని ఉత్తరాంధ్రపైనా తీవ్ర ప్రభావం ఉంటుందని వెల్లడించారు. ఒడిశాలోని కేంద్రపారా, పశ్చిమ బెంగాల్లోని దిఘా పట్టణం మధ్య తుఫాన్ తీరం దాటడానికి అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు. తుఫాన్ తన దిశను మార్చుకునే అవకాశాలు లేవని స్పష్టం చేశారు. తుఫాన్ తీరాన్ని దాటే సమయంలో కల్లోలాన్ని మిగిల్చవచ్చని వెల్లడించారు.
ఉత్తరం వైపు కదలికలు..
ఎంఫాన్ (AMPHAN) తుఫాన్కు కొత్త పేరు పెట్టారు ఐఎండీ అధికారులు. దీన్ని ఆంఫన్ (UMPUN)గా నామకరణం చేశారు. ప్రస్తుతం ఈ తుఫాన్.. బంగాళాఖాతంలో ఆగ్నేయ దిశలో స్థిరంగా ఉంది. ఇదివరకు ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఈ వాయుగుండం కాస్తా తుఫాన్గా రూపాంతరం చెందింది. వచ్చే 12 గంటల్లో తీవ్రమైన తుఫాన్ (Severe Cyclonic Storm)గా మారుతుందని భారతా వాతావరణ శాఖ అధికారులు తమ బులెటిన్లో వెల్లడించారు. ప్రస్తుతం ఇది ఒడిశాలోని పారాదీప్కు 1040 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్లోని దిఘా పట్టణానికి 1200 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.
ఆ మూడు రాష్ట్రాల్లో..
ఒడిశాలోని గజపతి, గంజాం, పూరీ, జగత్సింగ్ పూర్, కేంద్రపారా జిల్లాల్లో సాయంత్రం నాటికి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. జాజ్పూర్, బాలాసోర్, భద్రక్, మయూర్ భంజ్, ఖుర్దా జిల్లాల్లో మంగళవారం నుంచి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడతాయని తాజా బులెటిన్లో వెల్లడించారు. పశ్చిమ బెంగాల్లోని ఈస్ట్ మిడ్నాపూర్, దక్షిణ 24 పరగణ, ఉత్తర 24 పరగణ జిల్లాలపై తుఫాన్ ప్రభావం అతి తీవ్రంగా ఉంటుందని పేర్కొన్నారు. 20 నుంచి వెస్ట్ మిడ్నాపూర్, హౌరా, హుగ్లి, కోల్కత సహా పరిసర ప్రాంతాలపై దీని ప్రభావం ఉంటుందని చెప్పారు.