పేరు మారిన ఎంఫాన్ తుఫాన్: రెండు రాష్ట్రాలు గజగజ: ఏపీపైనా పడగ: 190 కిలోమీటర్ల వేగంతో
న్యూఢిల్లీ: పేరు మారినా రూపాన్ని మార్చుకోలేదా తుఫాన్. మరింత బలోపేతమైంది. వచ్చే 12 గంటల్లో తీవ్ర తుఫాన్గా రూపాంతరం చెందబోతోంది. రెండు రాష్ట్రాలపై విరుచుకుపడటానికి రాబోతోంది. దీని ప్రభావం.. ఏపీపైనా లేకపోలేదు. ఈ తుఫాన్ ప్రభావం వల్ల ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒడిశా, పశ్చిమ బెంగాల్పై ఈ తుఫాన్ పెను ప్రభావాన్ని చూపిస్తుందంటూ భారత వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో.. అక్కడి ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశాయి. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే పనులను ఆరంభించాయి.
Recommended Video
హైదరాబాద్ లో దంచికొడుతున్న వాన ..అల్పపీడన ప్రభావంతో 24 గంటల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు
ఎంఫాన్ కాస్తా ఆంఫన్గా
ఎంఫాన్ (AMPHAN) తుఫాన్కు కొత్త పేరు పెట్టారు ఐఎండీ అధికారులు. దీన్ని ఆంఫన్ (UMPUN)గా నామకరణం చేశారు. ప్రస్తుతం ఈ తుఫాన్.. బంగాళాఖాతంలో ఆగ్నేయ దిశలో స్థిరంగా ఉంది. ఇదివరకు ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఈ వాయుగుండం కాస్తా తుఫాన్గా రూపాంతరం చెందింది. వచ్చే 12 గంటల్లో తీవ్రమైన తుఫాన్ (Severe Cyclonic Storm)గా మారుతుందని భారతా వాతావరణ శాఖ అధికారులు తమ బులెటిన్లో వెల్లడించారు. ప్రస్తుతం ఇది ఒడిశాలోని పారాదీప్కు 1040 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్లోని దిఘా పట్టణానికి 1200 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.
భారీ నుంచి అతి భారీ వర్షాలు..
ఆదివారం మధ్యాహ్నం నుంచి ఆంఫన్ తుఫాన్లో కదలికలు ఏర్పడుతాయని.. తొలుత అది ఆగ్నేయ దిశగా కదులుతుందని, అనంతరం తన దిశను మార్చుకుంటుందని అన్నారు. ఈశాన్య దిశగా కదలడానికి వాతావరణం అనుకూలంగా ఉందని స్పష్టం చేశారు. దీని ప్రభావం ఒడిశా, పశ్చిమ బెంగాల్పై తీవ్రంగా ఉంటుందని చెప్పారు. దీని ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్ ఉత్తర జిల్లాల్లోనూ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని అంచనా వేశారు. 18 నుంచి 20వ తేదీల మధ్య ఈ తుఫాన్ అంచనాలకు మించిన స్థాయిలో విజృంభించే అవకాశాలు లేకపోలేదని స్పష్టం చేశారు.
తీరం దాటే సమయంలో అల్లకల్లోలమే
ఆంఫన్ తుఫాన్ తీరం దాటే సమయంలో విధ్వంసాన్ని సృష్టించే అవకాశాలు లేకపోలేదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. గంటకు కనిష్ఠంగా 160 నుంచి గరిష్ఠంగా 190 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొన్నారు. ఉరుములు, మెరుపులతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేశారు. తుఫాన్ ఎక్కడ తీరాన్ని దాటేదీ ఇంకా అంచానా వేయలేదు. తీర ప్రాంతాలన్నీ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఒడిశాలో 12 జిల్లాలపై
ఆంఫన్ తుఫాన్ను దృష్టిలో ఉంచుకుని ఒడిశా ప్రభుత్వం పలు ముందుజాగ్రత్త చర్యలను తీసుకుంది. 12 జిల్లాలపై ఈ తుఫాన్ ప్రభావం ఉంటుందని అంచనా వేసింది. గజపతి నగరం, గంజాం, పూరీ, ఖుర్దా, జాజ్పూర్, నయాఘర్, బాలాసోర్, భద్రక్, కేంద్రపారా, జగత్సింగ్ పూర్, మయూర్భంజ్, కటక్ జిల్లాలకు తుఫాన్ ముప్పు పొంచి ఉంది. దీనితో నవీన్ పట్నాయక్ ప్రభుత్వం.. ఆయా జిల్లాల తీర ప్రాంతాల్లో ముందుజాగ్రత్త చర్యలను చేపట్టింది. మత్స్యకారులెవరూ సముద్రంలో వేటకు వెళ్లకూడదని ఆదేశాలను జారీ చేసింది. జాతీయ విపత్తు నిర్వహణ బలగాలు (ఎన్డీఆర్ఎఫ్), రాష్ట్ర విపత్తు నిర్వహణ బలగాలను సిద్ధం చేసింది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనడానికి సన్నద్ధంగా ఉండాలని ఆదేశించింది.