cyclone bulbul:భారీ వర్షాలు, ఉరుముల బీభత్సం, బెంగాల్లో ఒకరి మృతి
బుల్ బుల్ తుపాన్ బెంగాల్లో బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ రాత్రి సందర్బన్ డెల్టా నుంచి.. భారత్ బంగ్లాదేశ్ మీదుగా తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈదురుగాలతో భారీ వృక్షాలు నెలకొరిగాయి. తుపాన్ ప్రభావంతో ఒకరు మృతిచెందినట్టు అధికారులు పేర్కొన్నారు. తీరప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
తుపాన్ ప్రభావంతో స్కూళ్లు, కాలేజీలకు సెలవులను మరో రెండురోజులు పొడిగిస్తున్నట్టు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పష్టంచేశారు. ఇప్పటికే లక్ష 20 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్టు తెలిపారు. తీరప్రాంతాల్లో భీతవాహ పరిస్థితి నెలకొందని ఆమె వెల్లడించారు. తుపాన్ తీవ్రత దృష్ట్యా భారత వాతావరణ విభాగం నిన్ననే ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది.
శని, ఆది రెండురోజులకు ఆరెంజ్ అలర్ట్ వర్తిస్తోందని అధికారులు తెలిపారు. ఒడిశాలోని బాలాసోర్, భద్రక్, కేంద్రపరా, జగత్ సింగ్ పూర్ వద్ద భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. బెంగాల్, ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తాయని.. 204 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుందని తెలిపారు.