బుల్బుల్ తుఫాను బీభత్సం: 9మంది మృతి, 4లక్షల మందిపై ప్రభావం, మమతకు ప్రధాని ఫోన్
కోల్కతా: బంగాళాఖాతంలో ఏర్పడ్డ బుల్ బుల్ తుఫాను పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బీభత్సం సృష్టిస్తోంది. పశ్చిమబెంగాల్ తోపాటు ఒడిశా రాష్ట్రంలోని దీని ప్రభావం భారీగానే ఉంది. గత రాత్రి ఈ తుఫాను పశ్చిమబెంగాల్-బంగ్లాదేశ్ల మధ్య తీరం దాటింది. ఈ ప్రభావంతో ఒడిశా, పశ్చిమబెంగాల్, పారాదీప్, బంగ్లాదేశ్ తీరాల్లో గంటకు 120-140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.
విద్యాసంస్థల బంద్, విమానాశ్రయం తాత్కాలిక మూసివేత
తుఫాను ప్రభావం కారణంగా పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలు మూసివేశారు. భారీ వర్షాలు, ఈదురుగాలులు మూలంగా కోల్కతా విమానాశ్రయం కూడా తాత్కాలికంగా మూత పడింది. బుల్ బుల్ తుఫాను బంగ్లాదేశ్ వైపుగా పయనిస్తున్నట్లుగా వాతావరణ శాఖ తెలిపింది.
తుఫాను బీభత్సవంతో 9మంది మృతి
బుల్ బుల్ తుఫాను కారణంగా కురుస్తున్న భారీ వర్షాలు, ఈదురు గాలులకు పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో వందల సంఖ్యలో ఇళ్లు ధ్వంసమయ్యాయి, వందలాది చెట్లు నేలకొరిగాయి. పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో తుఫాను సృష్టించిన బీభత్సానికి 9మంది మృత్యువాతపడ్డారు. పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారు.
నాలుగు లక్షలమందిపై ప్రభావం..
ఈ తుఫాను ప్రభావం పశ్చిమబెంగాల్లోని 9 జిల్లాల్లో తీవ్రంగా ఉంది. పంటలతోపాటు ఇళ్లు కూడా ఈ జిల్లాల్లో ధ్వంసమయ్యాయి. ఒడిశా తీర ప్రాంతంలోనూ భారీ నష్టమే జరిగింది. సుమారు నాలుగు లక్షల మంది ప్రజలపై ఈ తుఫాను ప్రభావం పడిందని ప్రభుత్వ అధికారులు తెలిపారు.
అండగా ఉంటాం.. మమతకు ప్రధాని పోన్..
కాగా, తుఫాను బీభత్సం సృష్టిస్తున్న నేపథ్యంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఫోన్ చేసి పరిస్థితిపై ఆరా తీశారు. కేంద్రం నుంచి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని ప్రధాని మోడీ సీఎం మమతకు భరోసా ఇచ్చారు. ఈ రెండు రాష్ట్రాల్లోని ప్రజలందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నట్లు ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.
సహాయక బృందాలు..
మమతా బెనర్జీతోపాటు ఉన్నతాధికారులు పశ్చిమబెంగాల్లో తుఫాను ప్రభావంపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తూ అవసరమైన చర్యలకు ఆదేశిస్తున్నారు. రెండు రాష్ట్రాల్లోనూ ఇప్పటికే కేంద్ర సహాయక బృందాలు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో మత్య్సకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.
అమిత్ షా పర్యవేక్షణ
పశ్చిమబెంగాల్లో 10 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఒడిశాలో 6 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. ఇంకా 18 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఈ రెండు రాష్ట్రాల్లోని తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పరిస్తితిని సమీక్షిస్తున్నామని, అవసరమైన సహాయక చర్యలు అందిస్తున్నామని చెప్పారు.