ఫణి తుఫాను: మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేసిన ఇండియన్ కోస్ట్ గార్డు
ఢిల్లీ: ఫణి తుఫాను ముంచుకొస్తోంది. ఈ నేపథ్యంలోనే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ మరియు ఇండియన్ కోస్ట్ గార్డులు హెచ్చరికలు జారీ చేశాయి. తుఫాను తీవ్రత క్రమంగా పెరుగుతున్నందున మత్స్యకారులు చేపల వేటకోసం సముద్రంలోకి వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశాయి. మంగళవారం నాటికి తుఫాను బలపడుతుందని గంటకు 180 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అలర్ట్లు జారీ చేస్తోంది. చెన్నై నగరానికి ఆగ్నేయ దిశలో 880 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమై ఉందని వెదర్ డిపార్ట్మెంట్ తెలిపింది. ఫణి తుఫాను ఆగ్నేయ దిశ నుంచి వాయువ్యదిశగా పయనిస్తోందని ఆ తర్వాత ఈశాన్య దిశకు మారుతుందని అధికారులు వెల్లడించారు.
భారత వాతావరణ కేంద్రం ఇస్తున్న నివేదిక ప్రకారం తమిళనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో స్వల్ప వర్షాలు కురిసే అవకాశాలుండగా ఒడిషాలో మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కేంద్ర హోంశాఖ ఎన్డీఆర్ఎఫ్, ఇండియన్ కోస్ట్ గార్డులను అలర్ట్ చేసింది. ఏప్రిల్ 25వ తేదీ నుంచి మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు హోంశాఖ కార్యాలయం తెలిపింది. అంతేకాదు సముద్రంలో వేటకు వెళ్లిన వారు వెనక్కు వచ్చేయాలంటూ ఆదేశాలు జారీ చేశామని వెల్లడించారు.
ఇదిలా ఉంటే ప్రధాని నరేంద్ర మోడీ పరిస్థితిని దగ్గరుండి సమీక్షిస్తున్నారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలంటూ అధికారులను ఆదేశించారు. మరోవైపు నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీతో వెంటనే సమావేశమై ముందస్తు జాగ్రత్తలపై చర్చించాలని కేబినెట్ సెక్రటరీ పీకే సిన్హాను మోడీ ఆదేశించారు. తుపాను ప్రభావిత రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించి వారు తీసుకుంటున్న చర్యల గురించి అడిగి తెలుసుకొని పరిస్థితిని దగ్గరుండి సమీక్షించాల్సిందిగా కోరారు ప్రధాని మోడీ. ఇక వాతావరణశాఖ ప్రతి మూడుగంటలకు ఒకసారి బులిటెన్ను విడుదల చేస్తోంది. వాటిని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు పంపుతోంది. కేంద్రహోంశాఖ కూడా రాష్ట్రప్రభుత్వాలతో టచ్లోకి వచ్చేసింది.