ఒడిశాలో ఫొని బీభత్సం ఆరుగురి మృతి, భారీ ఆస్తి నష్టం(వీడియో)
భువనేశ్వర్ : ఒడిశాలో ఫొని తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. పెను గాలులు, అతి భారీ వర్షాలతో రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ప్రకృతి విపత్తుకు జనం చివురుటాకులా వణికిపోతున్నారు. ఫొని కారణంగా ఇప్పటి వరకు ఆరుగురు మృతి చెందారు. బలంగా వీస్తున్న గాలులకు చెట్లు కరెంటు స్థంభాలు నేలకొరిగాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా భారీ ఆస్తి నష్టం సంభవించింది.
ఫోనీ ఎఫెక్ట్ః తక్షణసాయం కింద రూ.1000 కోట్లు
కనీవినీ ఎరుగని భీభత్సం
పూరీ వద్ద ఒడిశాలో ప్రవేశించిన ఫొని తుఫాను కనివినీ ఎరుగని బీభత్సం సృష్టించింది. తీర ప్రాంతాల్లో పరిస్థితి అధ్వానంగా మారింది. గంటకు 170 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తుండటంతో పలుచోట్ల చెట్లు, కరెంటు స్తంభాలు, టెలిఫోన్ టవర్స్ కుప్పకూలాయి. ఇక వర్షాల ధాటికి లోతట్టు ప్రాంతాలన్నీ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. భారీ వర్షం, గాలుల ధాటికి పలు చోట్ల ఇళ్లు నేలమట్టమయ్యాయి.
ఆరుగురి మృతి
ఫొని ప్రభావంతో కేంద్రపాడ, నయాపల్లిల్లో ఇప్పటి వరకు ఆరుగురు చనిపోయినట్లు సమాచారం. గోడ కూలిన కారణంగా వారంతా మృత్యువాతపడినట్లు తెలుస్తోంది. అయితే ప్రభుత్వం మాత్రం దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. తుఫాను కారణంగా లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. వారంతా సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. తుఫాను బాధితులకు ఆహారం, వైద్య సదుపాయాలు అందించేందుకు ఏర్పాట్లు చేశారు.
భువనేశ్వర్లో ఫొని విధ్వంసం
ఫొని తుఫాను ప్రభావం భువనేశ్వర్పై ఎక్కువగా ఉంది. రోడ్లపై చెట్లు, కరెంటు స్థంభాలు కూలిపోవడంతో సిబ్బంది వాటిని తొలగించే పనిలో పడ్డారు. కరెంటు, మంచినీటి సరఫరా నిలిచిపోవడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. వర్షపు నీటి కారణంగా రోడ్లు కొట్టుకుపోవడంతో పలు ప్రాంతాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఎయిర్పోర్టులోనూ ఫొని విధ్వంసం సృష్టించింది.
ఎగిరిపోయిన ఎయిమ్స్ హాస్టల్ పైకప్పు
బలమైన గాలులు వీస్తుండటంతో భువనేశ్వర్లోని కేఐఐటీ హాస్టల్స్ గాజు గ్లాసులు పగిలిపోయాయి. ఎయిమ్స్ హాస్టల్ పై కప్పు ఎగిరిపోయింది. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఎప్పటికప్పుడూ అధికారులతో కలిసి సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.