ఫొని బీభత్సం : ఎగిరిన పైకప్పులు.. పేకమేడల్లా టవర్లు.. కూలిన భారీ క్రేన్ (వీడియో)
భువనేశ్వర్: ఫొని తుఫాన్ ధాటికి ఒడిశాలోని పలు ప్రాంతాలు కకావికలం అయ్యాయి. నగరాలు కుదేల్ అయ్యాయి. జనజీవనం స్తంభించిపోయింది. ప్రత్యేకించి- రాజధాని భువనేశ్వర్, తుఫాన్ తీరాన్ని తాకిన పూరీ నగరాల్లో పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. ఈ రెండు నగరాల్లో పరిస్థితి భీతావహంగా మారింది. ఎటు చూసినా, నేలకూలిన చెట్లు, విరిగిపడ్డ విద్యుత్ స్తంభాలు, నేలకు తెగిపడ్డ తీగలు, పైకప్పుల్లేని నివాసాలు కనిపిస్తున్నాయి. యుద్ధం తరువాతి పరిస్థితి నెలకొన్నాయి ఆ రెండు నగరాల్లో. తుఫాన్ తీరాన్ని దాటిన సమయంలో వీచిన బలమైన ఈదురుగాలుల వల్ల రైల్వేస్టేషన్ పైకప్పులన్నీ ఎగిరిపోయాయి. సుమారు 50 అడుగుల ఎత్తు వరకు ఉన్న ఓ భారీ క్రేన్ నిట్టనిలువుగా కూలిపోయింది. ఈ ఘటనలో ఓ ఇళ్లు ధ్వంసమైంది.
20 ఏళ్ల తరువాత తొలిసారిగా..
తిత్లీ, పెథాయ్, గజ వంటి అనేక తుఫాన్లను ఎదుర్కొన్న అనుభవం ఒడిశాకు ఉంది. బంగాళాఖాతంలో ఏ అల్పపీడనం ఏర్పడినా, దాని దెబ్బకు బలయ్యేది ఒడిశానే. అయినప్పటికీ- ఫొని ధాటిని తట్టుకోలేకపోయిందా పొరుగు రాష్ట్రం. వణికిపోయింది. 1999లో 10 వేలమందికి పైగా మరణానికి కారణమైన సూపర్ సైక్లోన్ ను గుర్తుకు తెచ్చింది 20 ఏళ్ల తరువాత ఒడిశాను అలాంటి భయానక తుఫాన్ మరోసారి చుట్టుముట్టింది.
ఉక్కిరి బిక్కిరి
నాలుగు రోజులుగా భయపెడుతూ వచ్చిన ఫొని తుఫాన్.. అనుకున్నంత పనీ చేసింది. పూరీ, భువనేశ్వర్లల్లో విలయాన్ని సృష్టించింది. శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో ఫొని తుఫాన్ తీరాన్ని తాకిన సందర్భంగా ఒడిశా చివురుటాకులా వణికిపోయింది. సుమారు 190 కిలోమీటర్ల వేగంతో వీచిన ప్రచండ గాలులు ప్రభావానికి భయంకపితులయ్యారు జనం. నాలుగు గంటల పాటు ఈ రెండు నగరాల్లో ఈదురు గాలులు భయానక స్థితిని నెలకొల్పాయి. హోరుమంటూ భీకరంగా శబ్దాన్ని చేస్తూ వీస్తోన్న గాలులకు, ఏకధాటిగా కురుస్తున్న వర్షాలు తోడుకావడంతో ఒడిశా ఉక్కిరిబిక్కిరైంది.
గాలిపటాల్లా ఎగిరిన పైకప్పులు..
తుఫాన్ సృష్టించిన బీభత్సానికి భువనేశ్వర్ చెల్లాచెదురైంది. నగరంలోని పల్లపు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. రోడ్లపై వర్షపు నీరు చేరుకుంది. హైటెన్షన్ విద్యుత్, టెలికం టవర్లు పేకమేడల్లా కుప్పకూలిపోయాయి. ముందుజాగ్రత్త చర్యగా అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. చాలాచోట్ల విద్యుత్ స్తంభాలు నేలమట్టం అయ్యాయి. చెట్ల కొమ్మలు విరిగిపడి విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. వటవృక్షాలు సైతం కూకటి వేళ్లతో సహా నేలకు ఒరిగాయి. ఈదురుగాలుల తీవ్రతకు భువనేశ్వర్లోని బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం చాలావరకు దెబ్బతింది. ఈ విమానాశ్రయం పైకప్పులు గాలికి ఎగిరిపోయాయి. రైల్వేస్టేషన్ పైకప్పులు నామరూపాల్లేకుండా పోయాయి. గాలిపటాల్లా ఎగిరిపోయాయి. రైల్వేస్టేషన్లోని దాదాపు అన్ని ప్లాట్ ఫాంల పరిస్థితీ ఇలాగే తయారైంది. స్టేషన్ ఆవరణలో అమర్చిన భారీ హోర్డింగులు కుప్పకూలడంతో గోడలు ధ్వంసం అయ్యాయి.
నిట్టనిలువుగా కూలిన క్రేన్..
భువనేశ్వర్ లోని బలిపారా ప్రాంతంలో 60 అడుగుల ఎత్తు వరకు ఉన్న ఓ క్రేన్ నిట్టనిలువుగా కూలిపోయింది. నేరుగా వెళ్లి ఓ నివాసంపై పడింది. ఈ ఘటనలో ప్రాణాపాయం ఏమైనా ఏర్పడిందా? లేదా? అనే విషయం తెలియరావాల్సి ఉంది. బలిపారాలో ఓ బహుళ అంతస్తుల భవనం నిర్మాణంలో ఉంది. దీనికి అవసరమైన నిర్మాణ సామాగ్రిని పైఅంతస్తుకు చేర్చడానికి ఈ క్రేన్ను అక్కడ అమర్చారు. తుఫాన్ సందర్భంగా వీచిన బలమైన ఈదురుగాలుల దెబ్బకు ఆ క్రేన్ చూస్తూ, చూస్తుండగానే కుప్పకూలిపోయింది.
మరో 24 గంటల పాటు భారీ వర్షాలు..
తుఫాన్ వీడినా.. భారీ వర్షాలు మాత్రం ఇంకా కురుస్తాయని భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. భువనేశ్వర్, పూరీ, కటక్, మయూర్భంజ్, కేంద్రపారా, పారాదీప్, నయాగఢ్, జగత్సింగ్ పూర్, ఢెంకనాల్ వంటి చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలియజేశారు. సాధారణ పరిస్థితులు నెలకొనడానికి మరింత సమయం పట్టొచ్చని తెలుస్తోంది. దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైనట్లు సమాచారం.
136 షెల్టర్లు..
పల్లపు ప్రాంతాల్లో నివాసం ఉన్నవారిని అధికారులు ఖాళీ చేయించారు. తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో మొత్తం 11 లక్షలమందిని సురక్షిత ప్రదేశాలకు తరలించారు. ఒక్క భువనేశ్వర్ లోనే సుమారు మూడున్నర లక్షల మందిని ప్రభుత్వ అధికారులు సురక్షిత ప్రదేశాలకు తరలించారు. వారి కోసం నగరంలోని పలు ప్రాంతాల్లో 136 షెల్టర్లను ఏర్పాటు చేశారు. సాధారణ పరిస్థితులు నెలకొన్న తరువాతే వారిని ఇళ్లకు పంపిస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలు, విద్యాసంస్థలు, కమ్యూనిటీ హాళ్లను షెల్టర్లుగా మార్చారు. నిర్వాసితులకు భోజన సదుపాయాలను కల్పించారు.