తుఫానుగా అరేబియాలో అల్పపీడనం: మహారాష్ట్ర, గుజరాత్లపై తీవ్ర ప్రభావం, భారీ వర్షాలు
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో ఇటీవల తుఫాను బీభత్సం సృష్టించగా... ఇప్పుడు గుజరాత్, మహారాష్ట్రాల్లో మరో తుఫాను విరుచుకుపడేందుకు సిద్ధమైంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతోంది. 48 గంటల్లోనే ఇది తుఫానుగా ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం(ఐఎండీ) ఆదివారం వెల్లడించింది.
Recommended Video
జూన్ 3న ఈ అల్పపీడనం తుఫానుగా మారి మహారాష్ట్ర, గుజరాత్ తీరాలను తాకనుందని తెలిపింది. ఈ తుఫాను కారణంగా దేశంలోని పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తీర ప్రాంతాల్లోని మత్స్యకారులను వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.
ప్రస్తుతం దక్షిణ ఈశాన్య, తూర్పు మధ్య అరేబియా ప్రాంతంలో లక్ష ద్వీప్ వరకు అల్పపీడనం స్తిరపడి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాగల 48 గంటల్లో ఇది వాయుగుండంగా, ఆ తర్వాత తుఫానుగా మారుతుందని వెల్లడించింది. ఈ తుఫాను ఉత్తరాదిగా పయనించి మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపింది.
కాగా, ఈ అల్పపీడన ప్రభావంతో నేటి నుంచి మూడు రోజులపాటు లక్షదీప్, కేరళ, కర్ణాటక, తెలంగాణ, తదితర ప్రాంతాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. జూన్ 2,3,4 తేదీల్లో కొంకణ్, గోవా తీరాల్లో, మధ్య మహారాష్ట్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గుజరాత్ దక్షిణ భాగం, డామన్, డయ్యూ, దాద్రా నగర్ హవేలీ ప్రాంతాల్లోనూ వర్షాలు పడే అవకాశం ఉంది.