గజ తుపాను దెబ్బకు 45 మంది బలి, సీఎం పర్యటన ఖరారు, రూ. 4.5 కోట్లు పరిహారం!
చెన్నై: తమిళనాడులో గజ తుపానుకు అధికారికంగా 45 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి మీడియాకు చెప్పారు. తమిళనాడులోని సేలంలో ఆదివారం జరిగిన ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎడప్పాడి పళనిస్వామి అధికారులు ముందుగానే ఈ కార్యక్రమం నిర్ణయించారని, అందువలనే హాజరైనానని అన్నారు. గజ తుపాను మృతుల కుటుంబ సభ్యులకు రూ. 4.5 కోట్లు పరిహారం అందిస్తామని పళనిస్వామి చెప్పారు.
ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలకు హాజరౌతున్న కారణంగా గజ తుపాను వరదబాధిత ప్రాంతాల్లో పర్యటించడం సాధ్యం కాలేదని, ఈ నెల 20వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి బాధితులను పరామర్శిస్తానని సీఎం ఎడప్పాడి పళనిస్వామి అన్నారు.
ఇప్పటి వరకు గజ తుపానుకు 45 మంది మరణించారని, 700 పశువుల ప్రాణాలు పోయాయని సీఎం ఎడప్పాడి పళనిస్వామి వివరించారు. మృతుల కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లిస్తామని, గాయాలైన వారికి రూ. 25 వేల చొప్పున నష్టపరిహారం అందిస్తామని సీఎం ఎడప్పాడి పళనిస్వామి వివరించారు.
తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా 56 వేల గుడిసెలు సంపూర్ణంగా దెబ్బతిన్నాయని, 35 వేలకు పైగా ఇళ్లు దెబ్బతిన్నాయని, 2 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని, 372 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి వసతి సౌకర్యాలు కల్పించామని, 1014 మొబైల్ ఆరోగ్య శిభిరాలు ఏర్పాటు చేశామని సీఎం ఎడప్పాడి పళనిస్వామి మీడియాకు చెప్పారు.
గజ తుపాను దెబ్బ కారణంగా తమిళనాడులోని ఏడు జిల్లాల్లో 17 లక్షల చెట్లు కుప్పకూలిపోయాయని, 347 ట్రాన్స్ ఫార్మర్లు పూర్తిగా దెబ్బతిన్నాయని, 39 వేల విద్యుత్ స్థంభాలు విరిగిపోయాయని అధికారులు తెలిపారు. 3, 559 కిలోమీర్లు విద్యుత్ స్థంభాలు పూర్తిగా దెబ్బతినడంతో వాటి మరమత్తులు చెయ్యడానికి ఆ శాఖ అధికారులు, సిబ్బంది నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.