తుపాను ప్రమాదం: ఉత్తరాంధ్ర తీరంలో హై అలర్ట్
ఉత్తర అండమాన్ సముద్ర తీరంలో బుధవారం ఉదయం ఏర్పడిన అల్ప పీడనం తుపానుగా మారిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అండమాన్, నికోబార్ తీర ప్రాంతం మయాబందర్ తీరానికి మధ్యాహ్నం ఒకటిన్నర సమయంలో తుపాను తాకిడికి గురైందని తెలిపారు. ఈ ప్రభావంతో అండమాన్, నికోబార్ దీవులలో భారీ వర్షం కురిసినట్లు తెలిపారు.
రానున్న 48గంటల్లో వాయుగుండం తీవ్ర రూపం దాల్చనుందని, పశ్చిమ, వాయవ్య దిశగా తుపాను కదులుతోందని తెలిపారు. అక్టోబర్ 12లోపు భారత తూర్పు తీరాన్ని తాకే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఉత్తర కోస్తా తీరం, ఒడిశాలోని కళింగపట్నం, పారదీప్ తీరాలకు అక్టోబర్ 12 రాత్రి వరకు తుపాను ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు.
తీర ప్రాంతాల్లో 175-185 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని, భారీ వర్షాలకు అవకాశం ఉందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కోల్కతా రాష్ట్రాలకు చెందిన మత్స్యకారులను సముద్రంలోకి వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేసినట్లు వారు తెలిపారు. ఒడిశా తీర ప్రాంత జిల్లాలతోపాటు 14 జిల్లాల కలెక్టర్లను ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.
తుపాను వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు తెలియజేయాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురిక్షిత ప్రాంతాలకు తరలించడం, పునరావాస శిబిరాల ఏర్పాటు, తదితర విషయాలపై సత్వర చర్యలు చేపట్టాలని ఆయా జిల్లా కలెక్టర్లకు ఒడిశా ప్రభుత్వం తెలియజేసింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ఒకటో నెంబరు హెచ్చరిక జారీ చేశామని, మత్స్యకారులు సముద్రంలో వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేసింది. కోస్తా జిల్లాల కలెక్టర్లు, అధికారులకు, భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది.