Cyclone Jawad : 400 మంది గర్భిణీలు ఆస్పత్రులకు తరలింపు- ఒడిశా సర్కార్ నిర్ణయం
బంగాళాఖాతంలో ఏర్పడిన జవాద్ తుపాను ఏపీ, ఒడిశాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పెను తుఫాన్ కావడంతో ఇరు రాష్ట్రాలపై దీని ప్రభావం పడుతోంది. ఇప్పటికే ఇరు రాష్టాలూ దీనిపై అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. ఇదే క్రమంలో ఒడిశా సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.
ఒడిశాలో తుపాను బారిన పడతారని భావిస్తున్న దాదాపు 400 మందికి పైగా గర్భిణీల్ని ఇళ్ల నుంచి ఆస్పత్రులకు తరలించాలని నవీన్ పట్నాయక్ సర్కార్ నిర్ణయించింది. దీంతో అధికారులు వీరి ఇళ్లకు వెళ్లి వివరాలు తీసుకుని ఆస్పత్రులకు తరలించే పనిలో నిమగ్నమయ్యారు. జవాద్ తుపాను దృష్ట్యా తుపాను ప్రభావిత జిల్లాల్లోని గర్భిణులను ఒడిశా ప్రభుత్వం ఆసుపత్రులకు తరలిస్తోంది. ఇప్పటి వరకు 400 మందికి పైగా గర్భిణులను ఆసుపత్రులకు తరలించినట్లు అధికారులు ప్రకటించారు. మరోవైపు తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని స్థానికులను కూడా అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం నిన్న జవాద్ తుపానుగా మారింది. రేపు ఒడిశాలోని పూరీ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తుపానుతో ఎక్కువగా ప్రభావితమయ్యే ప్రాంతాలలో ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్, దక్షిణ కోస్తా ఒడిశా ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు ప్రకటించారు. కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా ప్రకటించారు. ఇది ఏపీ, ఒడిశాతో పాటు పశ్చిమ బెంగాల్, అస్సాం, మేఘాలయ, త్రిపురలోని ఏకాంత ప్రదేశాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంతది. తుఫాను కారణంగా సంభవించే ఎలాంటి పరిస్ధితుల్ని అయినా ఎదుర్కోవడానికి ఎన్డీఆర్ఎఫ్ 64 బృందాలను సిద్ధంగా ఉంచింది.
అటు ఏపీ ప్రభుత్వం కూడా ఉత్తరాంధ్రలో జవాద్ తుపానును ఎదుర్కొనేందుకు అన్ని ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇప్పటికే మూడు జిల్లాలతో పాటు పొరుగున ఉన్న గోదావరి జిల్లాల్లో సైతం అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. ఒక్క ప్రాణం కూడా పోవడానికి వీల్లేదని సీఎం జగన్ నిన్న అధికారులకు స్పష్టం చేశారు. అలాగే తుపాను సహాయక చర్యల కోసం జిల్లాకు పది కోట్ల రూపాయల చొప్పున అందుబాటులో ఉంచారు.