మహారాష్ట్రకు మరో వాయు"గండం": తీర ప్రాంతం వైపు దూసుకొస్తున్న క్యార్ తుఫాను
ముంబై: మహారాష్ట్రలో కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చిన వర్షాలు మళ్లీ క్యార్ తుఫాను రూపంలో ఆ రాష్ట్రాన్ని కబళించేందుకు వస్తున్నాయి. క్యార్ తుఫానుతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది. మహారాష్ట్ర తీరప్రాంత జిల్లాలు అయిన రత్నగిరి, సింధుధుర్గ్లలో రానున్న 12 గంటల్లో పెనుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ముంబైలోని భారత వాతావరణశాఖ శుక్రవారం మధ్యాహ్నం హెచ్చరికలు జారీ చేసింది.
అరేబియన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతోందని వాతావరణశాఖ తెలిపింది.ఇది శుక్రవారం ఉదయం తుఫానుగా మారినట్లు వెల్లడించింది. ప్రస్తుతం క్యార్ తుఫాను క్రమంగా పయనిస్తూ బలపడుతోందని వెదర్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. రానున్న 12 గంటల్లో ఇది మరింత బలపడి ప్రతాపాన్ని చూపేందుకు సిద్ధం అవుతోందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తుఫాను క్రమంగా కదులుతూ ఒమన్ తీరంవైపు పయనిస్తుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. తీరం దాటే సమయంలో పెనుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది.
ఇక క్యార్ తుఫాను ప్రభావిత ప్రాంతాలకు వాతావరణశాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. 24 గంటల్లో సింధుదుర్గ్ జిల్లాకు 204.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయని వాతావరణశాఖ పేర్కొంది. గంటకు 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఇక శనివారం రోజున మరింత పెరిగి గంటకు 110 కిలోమీటర్ల వేగంను అందుకుంటాయని వాతావరణశాఖ వెల్లడించింది. ఇక రత్నగిరి జిల్లాలో గంటకు 55-65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ ప్రభావం గోవా రాష్ట్రంపై కూడా పడే అవకాశాలున్నాయని వెల్లడించింది. ఇక మిగతా తీరప్రాంత జిల్లాల్లో గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ప్రారంభమై గంటకు 60 కిలోమీటర్ల మార్క్ను తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ ప్రభావం ఉత్తర కర్నాటక తీరం, గుజరాత్ తీరంపై కూడా పడుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.