గుజరాత్కు 'మహా'ముప్పు: బుధవారం తీరం తాకనున్న మహా తుఫాను
గుజరాత్ : కొద్దిరోజుల క్రితం అరేబియన్ సముద్రంలో క్యార్ తుఫాను అలజడి సృష్టించిన సంగతి తెలిసిందే..తాజాగా మరోసారి అదే అరేబియన్ సముద్రంలో మరో తుఫాను అలజడి సృష్టించేందుకు సిద్ధమవుతోంది. ఈ తుఫాను పేరు మహా. ప్రస్తుతం నార్త్ సెంట్రల్ అరేబియన్ సముద్రంలో తిష్ట వేసి ఉన్న మహా తుఫాను పశ్చిమ దిశగా పయనిస్తోందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. బుధవారం రాత్రికి లేదా గురువారం తెల్లవారుజామున గుజరాత్ తీరంను తాకే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. గుజరాత్ తీరంను తాకే సమయంలో తుఫాను బలపడి గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
మహారాష్ట్ర గుజరాత్లకు మహా తుఫాను
మహా తుఫాను ప్రభావం గుజరాత్లో ఎక్కువగా కనిపించనుండగా మహారాష్ట్రను కూడా తాకుతుందని అధికారులు తెలిపారు. రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెదర్ డిపార్ట్మెంట్ పేర్కొంది. మహా తుఫాను గుజరాత్ తీరంను తాకిన సమయంలో జునాగఢ్, గిర్ సోమ్నాథ్, ఆమ్రేలీ, భావ్నగర్, సూరత్, భరూచ్, ఆనంద్, అహ్మదాబాద్, బోతద్, పోర్బందర్, రాజ్కోట్, మరియు వడోదరలో బుధవారం మరియు గురువారం రోజున భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.ఇక మహారాష్ట్రలో ముంబై, థానే, పాల్గడ్తో పాటు పలు ఉత్తర మహారాష్ట్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
గంటకు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు
క్యార్ తుఫాను ఒమన్ తీరంను తాకిన తర్వాత మరో తుఫానుకు పేరు ఒమన్ పెట్టింది. ఈ పేరే మహా. ఇది అరేబియన్ సముద్రంలో మొదలై భారత్ను తాకి ఆపై దిశ మార్చుకుని ఆఫ్రికా వైపు పరుగులు పెడుతుందని అధికారులు చెబుతున్నారు. ఇక వాతావరణశాఖ చెబుతున్న ప్రకారం బుధవారం రాత్రి లేదా గురువారం తెల్లవారు జామున డియూ పోర్బందర్ల మధ్య తీరం దాటుతుంది.
గుజరాత్లో అతి తీవ్రమైన తుఫానుగా గంటకు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెప్పారు. గుజరాత్ తర్వాత అల్పపీడనం క్రమంగా బలపడి మహారాష్ట్రను తాకుతుందని అధికారులు తెలిపారు. శుక్రవారం ఉదయం మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. మహారాష్ట్ర గుజరాత్లలో మహా తుఫాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని హెచ్చరించారు. బుధవారం ఉదయం నుంచే సముద్రంలో మార్పులు కనిపిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
తుఫాను నేపథ్యంలో అత్యవసర సమావేశం
బుధవారం వరకు మత్స్యకారులు చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లరాదంటూ హెచ్చరికలు జారీ చేసింది. ఇక తుఫాను తీవ్రతతో ప్రజలు చాలా అప్రమత్తతతో ఉండాలని మట్టి ఇళ్లల్లో ఉండేవారిని ప్రభుత్వం వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని వాతావరణశాఖ అధికారులు సూచించారు. ఇక సమాచార వ్యవస్థ, విద్యుత్ తీగలకు భారీ నష్టం వాటిల్లుతుందని చెప్పిన అధికారులు పంట కూడా భారీగా దెబ్బతింటుందని చెప్పారు. ఇక చెట్లు నేలకొరిగే అవకాశాలున్నాయని హెచ్చరించారు.
ఇదిలా ఉంటే సోమవారం రోజున కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా తుఫాను పరిణామాలపై నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీతో చర్చించారు. గుజరాత్ మహారాష్ట్రల చీఫ్ సెక్రటరీలతో కూడా ఆయన సమావేశమై అవసరమైన జాగ్రత్తలు ముందుగానే తీసుకోవాలని ఈ విపత్తు నుంచి ప్రజలకు ఎలాంటి హాని కలగకూడదని చెప్పారు. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఆయా ప్రాంతాలకు తరలి వెళ్లినట్లు అధికారులు తెలిపారు.