తుపాను ముప్పు: 80 కి.మీ వేగంగా గాలులు: అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ
చెన్నై: తమిళనాడుకు భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వచ్చే 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని తమిళనాడు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 27వ తేదీ నాటికి హిందూ మహాసముద్రం, బంగాళాఖాతానికి ఆగ్నేయంగా అల్పపీడనం ఏర్పడుతుందని, క్రమంగా అది వాయుగుండంగా మారుతుందని వెల్లడించారు. దీని ప్రభావంతో- వచ్చే 48 గంటల్లో తమిళనాడు తీర ప్రాంత జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. వాయుగుండం తుపానుగా మారే అవకాశాలు ఉన్నాయని, ఈ సమయంలో 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొన్నారు. పుదుచ్చేరిలో కూడా ఇదే తరహా వాతావరణం నెలకొంటుందని అన్నారు. మాడు పగులగొడుతున్న ఎండ తీవ్రతను ఎదుర్కొంటున్న తమిళనాడు, పుదుచ్చేరి ప్రజలకు ఇది ఊరట కలిగించే విషయమే.
80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచేంత తీవ్రతతోొ వాయుగుండం ఏర్పడే అవకాశాలు ఉండటం భయాందోళనలకు దారి తీస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడబోయే అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ, ఏపీలోని కోస్తా జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురుస్తాయని అధికారులు తెలిపారు. హిందూమహా సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలో 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, వచ్చే 48 గంటల్లో ఇది అల్పపీడనంగా మారుతుందని, క్రమంగా బలపడి వాయుగుండం మారే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. దీంతో శ్రీలంకకు ఆగ్నేయంగా దక్షిణ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని అంచనా వేశారు. ఇది రానున్న 36 గంటల్లో బలపడి వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.