నిసర్గ పడగ: వణుకుతున్న ఆ మూడు రాష్ట్రాలు: ఆరు అడుగుల ఎత్తు వరకు అలలు
ముంబై: అరేబియా సముద్రంలో కేంద్రీకృతమైన తొలి ట్రాపికల్ సైక్లోన్ నిసర్గ.. క్రమంగా మహారాష్ట్ర వైపు కదులుతోంది. మరి కొన్ని గంటల్లో తీరాన్ని తాకబోతోంది. ఈ ఉష్ణమండల తుఫాన్ మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లా అలీబాగ్ వద్ద దాటుతుందని భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో మహారాష్ట్ర, గుజరాత్, గోవా, కర్ణాటక ఉత్తర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. మహారాష్ట్ర తీర ప్రాంత జిల్లాల్లో విధ్వంసాన్ని మిగిల్చే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Recommended Video
ముంచుకొస్తోన్న ట్రాపికల్ సైక్లోన్ నిసర్గ: విధ్వంసానికి కొన్ని గంటలే: పేరు పెట్టిందెవరంటే?
ముంబైకి 200 కిలోమీటర్ల దూరంలో..
బుధవారం ఉదయం 6 గంటల సమయానికి ఈ తుఫాన్ అరేబియా సముద్రంలో ముంబైకి ఆగ్నేయ దిశగా 200 కిలోమీటర్లు. అలీబాగ్కు 155 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఈ తుఫాన్ గంటకు 13 కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్లు అంచనా వేశారు. తన దిశను మార్చుకోవడనికి అవకాశాలు లేవని స్పష్టం చేశారు. క్రమంగా ఇది అలీబాగ్ వైపు కదులుతోందని సాయంత్రానికి తీరాన్ని తాకుతుందని తెలిపారు.
200 నుంచి 230 కిలోమీటర్ల వేగంతో..
నిసర్గ సూపర్ సైక్లోన్గా ఆవిర్భవించింది. గంటగంటకూ బలపడుతోంది. తీరాన్ని చేరేలోగా మరింత ఉగ్రరూపాన్ని సంతరించుకునే అవకాశాలు లేకపోలేదని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తీరాన్ని దాటే సమయంలో కనీసం 200 నుంచి 230 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని స్పష్టం చేశారు. అలలు కనీసం ఆరు మీటర్ల ఎత్తు వరకు ఎగిసి పడే ప్రమాదం ఉందని అన్నారు. సముద్రం ముందుకు చొచ్చుకుని రావడానికి అవకాశం ఉందని చెప్పారు. 1891 తరువాత తొలిసారిగా ఓ ఉష్ణమండల తుఫాన్ మహారాష్ట్ర వైపు దూసుకుని రావడం ఇదే తొలిసారి. భారీగా ఆస్తినష్టాన్ని మిగిల్చే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.
రైళ్లు దారి మళ్లింపు..
నిసర్గ తుఫాన్ను దృష్టిలో ఉంచుకుని సెంట్రల్ రైల్వే అధికారులు ముందుజాగ్రత్త చర్యలను తీసుకున్నారు. ముంబైకి వచ్చే అయిదురైళ్లను దారి మళ్లించారు. కొన్నింటిని రీ షెడ్యూల్ చేశారు. తుఫాన్ తీరాన్ని దాటడానికి కొన్ని గంటల ముందు ప్రభావిత ప్రాంతాల్లో నడిచే రైళ్లు.. సమీప స్టేషన్లలో హాల్ట్ చేసేలా చర్యలు చేపట్టారు. ప్రాణ, ఆస్తినష్టాన్ని నివారించడంలో భాగంగా అన్ని చర్యలను తీసుకున్నట్లు సెంట్రల్ రైల్వే అధికారులు వెల్లడించారు.
ఎన్డీఆర్ఎఫ్ బలగాలు మోహరింపు..
తుఫాన్ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. తీరప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించింది. జాతీయ విపత్తు నిర్వహణ బలగాలను రంగంలోకి దింపింది. పాల్ఘర్, ముంబై, రాయగఢ్, రత్నగిరి, సింధుదుర్గ్ వంటి ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బలగాలను మోహరింపజేసింది. ప్రాణనష్టాన్ని నివారించడానికి అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగించుకుంటున్నామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తుఫాన్ తీరాన్ని దాటే సమయంలో ఇళ్లల్లో నుంచి బయటికి రావొద్దని సూచించారు. తీర ప్రాంత ప్రజలతో పాటు రోడ్డుపక్కన నివాసం ఉంటోన్న వారినీ సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు..
తుఫాన్ ప్రభావం వల్ల ఇప్పటికే ముంబై సహా పలు నగరాల్లో వర్షాలు కురుస్తున్నాయి. పరేల్, ములుంద్, గోరేగావ్ వసైరోడ్, నవీ ముంబైలల్లో రాత్రంతా ఓ మోస్తరు వర్షపాతం నమోదైంది. అది భారీ నుంచి అతి భారీగా మారవచ్చని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. పాల్ఘర్, గ్రేటర్ ముంబై, రాయగఢ్ జిల్లాల్లోనూ వర్షపాతం నమోదైంది. అటు గుజరాత్పైనా తుఫాన్ ప్రభావం పడింది. వాపి, వల్సాడ్, భావ్నగర్, అమ్రేలి, దాద్రానగర్, దమన్లల్లో వర్షలు కురుస్తున్నాయి.