పొంచివున్న ఉష్ణమండల తుఫాన్: 120 సంవత్సరాలకు ఒకసారి: 3 రాష్ట్రాలపై విరుచుకుపడటానికి
న్యూఢిల్లీ: ఉష్ణమండల తుఫాన్.. మనదేశంలో ఈ మధ్య కాలం ఎప్పుడూ వినిపించని పేరు. ఈ తరహా తుఫాన్ పొరుగు దేశాలపై విరుచుకుపడిన సందర్భాలు ఉన్నప్పటికీ..భారత్పై దీని ప్రభావం తక్కువే. అత్యంత ప్రమాదకరమైన ఈ ఉష్ణమండల తుఫాన్ ప్రస్తుతం పొంచివుంది. ప్రస్తుతం అరేబియా సముద్రంలో కేంద్రీకృతమైన ఈ తుఫాన్ ప్రభావం మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక ఉత్తర ప్రాంతాలపై విరుచుకుపడే ప్రమాదం లేకపోలేదని భారత వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. నిసర్గ అని పేరు పిలుస్తున్నారు.
Recommended Video
మమతపై మోడీ ప్రశంసలు- తుఫాన్ ఎదుర్కొన్న తీరు అద్భుతమంటూ కితాబు...
24 గంటల్లో అతి భారీ వర్షాలు..
ఈ తుఫాన్ వల్ల వచ్చే 24 గంటల్లో కర్ణాటక ఉత్తర తీర ప్రాంత జిల్లాలతో పాటు గోవా, మహారాష్ట్ర, గుజరాత్ దక్షిణ తీర ప్రాంతం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాల కురుస్తాయని వెల్లడించారు. ఈ తుఫాన్ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే రెడ్ అలర్ట్ను జారీ చేశారు. ప్రత్యేకించి మహారాష్ట్ర, గుజరాత్లల్లో ఈ తుఫాన్ విధ్వంసాన్ని సృష్టించే అవకాశాలు లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. ఆయా రాష్ట్రాల ప్రభుత్వం తక్షణమే ముందుజాగ్రత్త చర్యలను చేపట్టాల్సి ఉంటుందని సూచించారు.
1891 తరువాత..
ఉష్ణమండల తుఫాన్ బారిన పడటం మహారాష్ట్రకు 1891 తరువాత ఇదే తొలిసారి అవుతుందని వాతావరణ శాఖ అధికారలు చెబుతున్నారు. వేసవి కాలం ముగింపు దశలో అంటే దాదాపు నైరుతి రుతు పవనాలు దేశంలో ప్రవేశించే జూన్ నెలల్లో ఇంతటి భీకరమైన తుఫాన్ 120 సంవత్సరాల కిందట ఏర్పడిందని, ఆ తరువాత మళ్లీ ఇప్పుడే అలాంటి పరిస్థితి ఏర్పడిందని వెల్లడించారు. జూన్లో మహారాష్ట్ర తీర ప్రాంత జిల్లాలు ఓ ఉష్ణమండల తుఫాన్ను ఎదుర్కొనడానికి సన్నద్ధం కావాల్సిన పరిస్థితులు ఏర్పడం అత్యంత అరుదైన విషయమని చెప్పారు.
1948, 1980లో ఏర్పడినా
1948, 1980ల్లో జూన్లో మహారాష్ట్ర రెండుసార్లు తుఫాన్లను ఎదుర్కొన్నప్పటికీ.. అవి ఉష్ణమండల తుఫాన్లు కావని, ట్రాపికల్ సైక్లోన్గా అవి రూపాంతరం చెందలేకపోయాయని యూకేకు చెందిన వాతావరణ పరిశోధన పీహెచ్డీ స్కాలర్ అక్షయ్ దేవ్రస్ తెలిపారు. ఈ సారి మాత్రం దీనికి భిన్నంగా.. ఆరంభంలోనే అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాన్.. ట్రాపికల్ సైక్లోన్గా రూపుదిద్దుకుందని, దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు.
హఠాత్తుగా విరుచుకుని పడటం దీని ప్రత్యేకత
సాధారణ తుఫాన్ల కంటే ఉష్ణమండల సైక్లోన్లు ప్రమాదకమని అక్షయ్ తెలిపారు. తీరాన్ని తాకిన వెంటనే ఉష్ణమండల తుఫాన్లు సాధారణ తుఫాన్లకు భిన్నంగా ప్రవర్తిస్తాయని, హఠాత్తుగా వేగం పుంజుకుంటాయని అన్నారు. ఆ సమయంలో దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. తుఫాన్ తీరాన్ని దాటే సమయంలో ఒక్కసారిగా గాలుల్లో తీవ్రత పెరుగుతుందని అన్నారు. ఈదురు గాలులు అనూహ్యంగా తమ దిశను మార్చుకుంటుంటాయని అన్నారు.
ఉత్తర మహారాష్ట్ర, దక్షిణ గుజరాత్ ప్రాంతాల మధ్య
మహారాష్ట్ర ఉత్తర ప్రాంతం, గుజరాత్ దక్షిణ ప్రాంతాల మధ్య నిసర్గ తుఫాన్ తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లు స్కైమెట్ వెల్లడించింది. దీనిపై భారత వాతావరణ శాఖ ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని వెల్లడించలేదు. అయినప్పటికీ.. ఈ తుఫాన్ ప్రభావంతో వచ్చే 24 గంటల్లో కర్ణాటక ఉత్తర ప్రాంతం, గోవా మొదలుకుని మహారాష్ట్ర, గుజరాత్ తీర ప్రాంత జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. వచ్చే 24 గంటల్లో ఆయా ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని నిర్ధారించారు.