ముంచుకొస్తోన్న ట్రాపికల్ సైక్లోన్ నిసర్గ: విధ్వంసానికి కొన్ని గంటలే: పేరు పెట్టిందెవరంటే?
న్యూఢిల్లీ: అరేబియా సముద్రంలో కేంద్రీకృతమైన తొలి ట్రాపికల్ సైక్లోన్ నిసర్గ.. క్రమంగా మహారాష్ట్ర వైపు కదులుతోంది. బుధవారం ఉదయం ఈ ఉష్ణమండల తుఫాన్ తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లా అలీబాగ్ వద్ద తీరాన్ని తాకుతుందని అంచనా వేశారు. ముంబైకి దక్షిణ దిశగా 95 కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ అలీబాగ్. దీని ప్రభావంతో మహారాష్ట్ర, గుజరాత్, గోవా, కర్ణాటక ఉత్తర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.
Recommended Video
వచ్చే 12 గంటల్లో సూపర్ సైక్లోన్గా
అరేబియా సముద్రంలో ముంబైకి ఆగ్నేయ దిశగా 490 కిలోమీటర్ల దూరంలో, గోవా రాజధాని పనాజీకి 280 కిలోమీటర్ల దూరంలో, గుజరాత్లోని సూరత్కు 710 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న ఈ తుఫాన్ క్రమంగా మరింత బలపడుతోందని అధికారులు వెల్లడించారు. వచ్చే 12 గంటల్లో సూపర్ సైక్లోన్గా రూపాంతరం చెందడానికి అవకాశాలు ఉన్నాయని అంచనా వేశారు. బుధవారం ఉదయం మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లా అలీబాగ్ సమీపంలోని హరిహరేశ్వర్, గుజరాత్లోని దమన్ మధ్య తీరం దాటుతుందని అంచనా వేసినట్లు భారత వాతావరణ శాఖ తుఫాన్ల విభాగం ఇన్ఛార్జి సునీతా దేవి తెలిపారు.
తీరం దాటే సమయంలో
నిసర్గ తుఫాన్ తీరాన్ని దాటే సమయంలో 120 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయడానికి అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం తుఫాన్ ఉన్న స్థితిగతులను అంచనా వేయడం ద్వారా తీరం దాటే సమయంలో ఈదురుగాలుల తీవ్రత 110 నుంచి 120 కిలోమీటర్ల వరకు ఉంటుందని, అది సూపర్ సైక్లోన్గా ఆవిర్భవించడానికి అవకాశం ఉన్నందున గాలుల తీవ్రత పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ఫలితంగా మహారాష్ట్ర, గుజరాత్, గోవాలలో భారీ వర్షపాతం నమోదు కావడానికి అవకాశం ఉందని అన్నారు.
పేరు పెట్టిన బంగ్లాదేశ్..
అరేబియా సముద్రంలో ఈ తుఫాన్కు బంగ్లాదేశ్ సూచించిన విధంగా నిసర్గ అని నామకరణం చేశారు వాతావరణ శాఖ అధికారులు. కొద్దిరోజుల ముందే ఒడిశా, పశ్చిమ బెంగాల్ సహా, బంగ్లాదేశ్ను వణికించిన ఆంఫన్ తుఫాన్కు థాయ్లాండ్ పేరు పెట్టింది. ఈ సారి ఆ అవకాశాన్ని బంగ్లాదేశ్ తీసుకుంది. ఆంఫన్ తుఫాన్ వల్ల పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. ఈ రెండు రాష్ట్రాల్లో 20 జిల్లాలపై తుఫాన్ ప్రభావం తీవ్రంగా పడింది. 90 మందికి పైగా మరణించారు. భారీగా ఆస్తినష్టం సంభవించింది.
మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం
నిసర్గ తుఫాన్ వల్ల గుజరాత్తో పోల్చుకుంటే మహారాష్ట్ర తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఇప్పటికే వేలాదిగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో విలవిల్లాడుతోన్న మహారాష్ట్రకు తుఫాన్ రూపంలో మరో సంకటం వచ్చి పడుతోంది. తుఫాన్ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. తీర ప్రాంతాల జిల్లాల వెంట భారీగా జాతీయ విపత్తు నిర్వహణ బలగాలను మోహరింపజేసింది. మత్స్యాకారులెవరూ చేపలవేటకు వెళ్లకూడదని ఆదేశించింది. ఐఎండీ అధికారులు రెడ్ అలర్ట్ను జారీ చేశారు.