Cyclone Nisarga: అలా ముంబైకి తప్పిన ముప్పు, బలహీనపడిన తుఫాను, ముగ్గురు మృతి
ముంబై: అరేబియా సముద్రంలో ఏర్పడిన నిసర్గ తీవ్ర తుఫాను బుధవారం మధ్యాహ్నం తీరం దాటిన అనంతరం సాయంత్రానికి బలహీనపడింది. రాత్రికి మరింతగా బలహీనపడింది. బలహీనపడిన తుఫాను నాసిక్, ధూలే, నందుర్బర్ జిల్లావైపు వెళ్లింది. దీంతో ఆ ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Cyclone Nisarga: మహారాష్ట్రలో బీభత్సం, ముంబై అతలాకుతలం, జారిన విమానం
అందుకే ముంబైకి తప్పిన ముప్పు..
బుధవారం మధ్యాహ్నం రాయగఢ్ జిల్లా అలీబాగ్ వద్ద ఈ తుఫాను తీరం దాటిన విషయం తెలిసిందే. ఆ సమయంలో 110-120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. అయితే, ఆ తర్వాత కొంత సేపటికే తగ్గుముఖం పట్టడంతో ముంబై ఊపిరిపీల్చుకుంది. దక్షిణ అలీబాగ్ ప్రాంతంలో ఈ తుఫాను తీరం దాటడం వల్లే ముంబైకి ముప్పు తప్పిందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. అలీబాగ్ ముంబైకి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఈదురు గాలులు, భారీ వర్షాలు
తుఫాను కారణంగా ముంబైతోపాటు థానే, రాయ్గఢ్, పుణె ప్రాంతాల్లో అనేక చెట్లు విరిగిపడ్డాయి. పలు చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. అలీబాగ్ ప్రాంతంలో ఓ విద్యుత్ స్తంభం మీద పడటంతో ఓ వృద్ధుడు మృతి చెందాడు. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
గుజరాత్కూ తప్పిన ముప్పు.. వర్షాలే
కాగా, నిసర్గ తుఫాను ముప్పు గుజరాత్ రాష్ట్రానికి కూడా తప్పింది. ఆ రాష్ట్రంలో తుఫాను కారణంగా భారీ వర్షాలు మాత్రమే కురిశాయి. మరో రెండ్రోజులపాటు దక్షిణ గుజరాత్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
తుఫాను బీభత్సానికి ఇద్దరు మృతి
నిసర్గ తుఫాను కారణంగా పుణె జిల్లాలో బుధవారం ఇద్దరు మృతి చెందారని, మరో ముగ్గురు గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఇంటి గోడ కూలడంతో మంజుబాయి అనంత్ నావలే(65) అనే మహిళ మృతి చెందారు. మరో ముగ్గురు ఆమె కుటుంబసభ్యులు ఈ ఘటనలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మోకర్వాడి ప్రాంతంలో ఇంటిపైకప్పు కూలడంతో ప్రకాశ్ మోకర్(52) మృతి చెందారు.