నివర్ తుపాన్ ఎఫెక్ట్ - తమిళనాడు నుంచి 30 వేలు, పుదుచ్చేరి నుంచి 7 వేల మంది తరలింపు..
బంగాళాఖాతంలో ఏర్పడిన నివర్ తుపాను తమిళనాడు తీరం వైపు దూసుకొస్తోంది. రాబోయే 12 గంటల్లో తమిళనాడులోని మామళ్లాపురం-కరైకల్ మధ్య తుపాను తీరం దాటొచ్చని భారత వాతావరణ విభాగం అంచనా వేస్తోంది. తుపాను ప్రభావంతో ఇప్పటికే తమిళనాడు, పుదుచ్చేరి, ఏపీలోనూ వర్షాలు పడుతున్నాయి. తమిళనాడు, పుదుచ్చేరిపై తుపాను ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. భారీ వర్షాలతో రైళ్లు, విమానాల రాకపోకలు రద్దయ్యాయి. ఇరు రాష్ట ప్రభుత్వాలు సాధారణ సెలవు ప్రకటించేశాయి.
నివర్ తుపానును ఎదుర్కొనేందుకు ఎన్డీఆర్ఎఫ్ 25 బృందాలను ఏపీ, తమిళనాడు, పుదుచ్చేరి పరిధిలో రంగంలోకి దింపింది. ఇప్పటికే తమిళనాడులో 30 వేల మందిని, పుదుచ్చేరిలో 7 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ఎన్డీఆర్ఎఫ్ డీజీ ఎస్ఎన్ ప్రధాన్ ఎఎన్ఐ వార్తాసంస్ధకు తెలిపారు. తుపాను ప్రభావం తీవ్రంగా ఉండబోతుందని తాము అంచనా వేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. తుపాను ఎలా ఉన్నప్పటికీ దాన్ని ఎదుర్కొనేందుకు ఎన్డీఆర్ఎఫ్ సర్వసన్నద్ధంగా ఉందన్నారు.
ఈ రాత్రికి నివర్ తుపాను తీవ్ర తుపానుగా మారడం ఖాయమని అంచనా వేస్తున్నారు. ఇది రేపు తెల్లవారు జామున కానీ ఉదయం ానీ తీరం దాటే అవకాశాలున్నాయి. దీంతో ఆ సమయంలో తీవ్ర ఈదురుగాలులు వీస్తాయనే హెచ్చరికలు ఇస్తున్నారు. వీటి వల్ల ఎలాంటి ప్రాణనష్టం కలుగకుండా ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని తమిళనాడు, పుదుచ్చేరి ప్రభుత్వాలు ప్రజలను కోరుతున్నాయి. తుపాను, భారీ వర్షాల కారణంగా తమిళనాడు నుంచి వెళ్లే 12 రైళ్లను రైల్వేశాఖ రద్దు చేసింది. అలాగే చెన్నై విమానాశ్రయానికి కూడా రాకపోకలు రద్దయ్యాయి.