దూసుకొస్తున్న నివర్ తుపాను -బుధవారం సెలవు -సాయంత్రం కాదు, రాత్రికే తీరం దాటనుంది..
బంగాళాఖాతంలో కొనసాగుతున్న నివర్ తుపాను గమనంలో అతి స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం పుదుచ్చేరి తీరం నుంచి 380 కి.మీ, చెన్నై తీరం నుంచి 430 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉన్న ఈ తుపాను.. బుధవారం (నవంబర్ 25) సాయంత్రం 5 గంటల నాటికి అతి తీవ్ర తుపానుగా మారి తీరం దాటుతుందని అంచనా వేసినప్పటికీ, దాని వేగంలో మార్పుల కారణంగా బుధవారం రాత్రి 8 గంటల తర్వాతే తీరాన్ని తాకుతుందని, గరిష్టంగా బుధవారం అర్ధరాత్రిలోపే తీరం దాటుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
నివర్ బీభత్సం: ఇసుక బస్తాలతో అణు కేంద్రానికి రక్షణ - తీర జిల్లాల్లో 144 సెక్షన్ -ఇదీ తాజా సీన్
నివర్ తుపాను తీరాన్ని తాకే సమయం కొంత ఆలస్యం కానుప్పటికీ, అది ప్రయాణిస్తోన్న దశలో ఎలాంటి మార్పు లేదని, బుధవారం అర్ధరాత్రిలోపు పుదుచ్చేరికి సమీపంలో కరైకల్ - మహాబలిపురం (తమిళనాడు) మధ్య అది తీరం దాటుతుందని అధికారులు చెప్పారు. నివర్ తీరాన్ని దాటే సమయంలో గంటకు 120కిమీ నుంచి గరిష్టంగా 145 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొన్నారు. తుపాను ప్రభావం శుక్రవారం దాకా కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపారు. కాగా,
నివర్ అతితీవ్ర తుపానుగా తీరం దాటనుండటం, మంగళవారం నుంచి తమిళనాడు, పుదుచ్చేరిలో వర్షాలు కురుస్తుండటంతో అక్కడి ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. నివర్ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం బుధవారం సెలవు ప్రకటించింది. ఉత్తర తమిళనాడు జిల్లాలపై తుపాను ప్రభావం తీవ్రంగా ఉంటుందని, అతి భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రజలెవరూ బయట తిరగొద్దని, కీలకమైన డాక్యుమెంట్లను జాగ్రత్త చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
వ్యాక్సిన్ వేసుకున్నా కొవిడ్-19వ్యాధి? -సమర్థత, సరఫరాపై గందరగోళం -ఈ ప్రశ్నలకు బదులేది?
Recommended Video
ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా తమిళనాడు తీరంలో రెండు కోస్ట్ గార్డ్ నౌకలు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు. సముద్రం కల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తమిళనాడు సీఎం ఒక ప్రకటనలో కోరారు. తుపాను ప్రభావిత 11 జిల్లాల్లో మంగళవారం మధ్యాహ్నం నుంచే బస్సు సర్వీసుల్ని నిలిపేశారు. పలు రైలు సర్వీసుల్ని కూడా పూర్తిగా, తాత్కాలికంగా నిలిపేశారు. తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ కలిపి మొత్తం 30 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేశారు.