నీవర్ సైక్లోన్: అర్ధరాత్రి పుదుచ్చేరి సమీపంలో తీరం దాటే ఛాన్స్.. తమిళనాడు సర్కార్ కూడా అలర్ట్..
నీవర్ తుఫాన్ గజ గజ వణికిస్తోంది. ఎముకలు కొరికే చలిలో తీవ్ర తుఫాన్ చేసే నష్టం ఆందోళన కలిగిస్తోంది. మరో 12 గంటల్లో తమిళనాడు, పుదుచ్చేరి మధ్య తీరం దాటుతోందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అయితే తీరం దాటే సమయంలో వీచే ప్రచండ గాలులతో జరిగే ఆస్తి నష్టం, తీర ప్రాంత ప్రజలపై ఎంత ఎఫెక్ట్ చూపిస్తుందనే అంశం కలవరానికి గురిచేస్తోంది.
పుదుచ్చేరిలో గల కరైకల్, మమల్లాపురం మధ్య తీరం దాటనుంది. బుధవారం అర్ధరాత్రి లేదంటే.. గురువారం తెల్లవారుజామున అని ఐఎండీ ఒక ప్రకటనలో తెలిపింది. తుఫాన్ నేపథ్యంలో చెంబరంబక్కం రిజర్వాయర్ నుంచి 1000 క్యూసెక్కుల నీటిని అద్వార్ నదీలోకి పంపించారు. నదీ ప్రవాహాక ప్రాంతాల్లో ఉంటోన్న వందలాది మందిని పునరావస కేంద్రాలకు పంపించారు. చెన్నై ఆర్టియల్ రోడ్ వద్దకు భారీగా నీరు చేరింది. మోకాలి వరకు నీరు రావడంతో చాలా ఇళ్లల్లోకి నీరు వచ్చేసింది.
తుపాన్ నేపథ్యంలో బుధవారం సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే. దానిని గురువారం కూడా పొడగించారు. రిజర్వాయర్ నుంచి నీరు విడుదల చేయడంతో ప్రజలు భయపడొద్దని సీఎం పళనిస్వామి కోరారు. రిజర్వాయర్ సామర్థ్యం 24 ఫీట్లు కాగా.. ప్రస్తుత సామర్థ్యం 21.5 ఫీట్లుగా ఉంది. అద్వార్ నదీ సామర్థ్యం 60 వేల క్యూసెక్కులుగా ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. చెన్నైలోని 30 ప్రాంతాల్లోకి నీరు వచ్చే అవకాశం ఉందని చెప్పారు.