డేరింగ్ సీఎం: ఏకంగా సముద్రం వద్దే మకాం: తుఫాన్ సహాయక చర్యలపై ప్రత్యక్ష సమీక్ష
కరైకల్: తీరం వైపు దూసుకొస్తోన్న నివార్ తుఫాన్ వల్ల తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పొరుగునే ఉన్న పుదుచ్చేరిపైనా తుఫాన్ ప్రభావం ఉంటుందని, 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయంటూ వాతావరణ శాఖ అధికారులు జారీ చేసిన హెచ్చరికలతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. తుఫాన్ సహాయక చర్యలను పుదుచ్చేరి ప్రభుత్వం ముమ్మరం చేసింది. నివార్ పెను తుఫాన్ను రూపుదాల్చిన పరిస్థితుల్లో ప్రాణ నష్టాన్ని వీలైనంతగా తగ్గించడానికి ముందుజాగ్రత్త చర్యలను తీసుకుంటోంది.
ముఖ్యమంత్రులకు మోడీ వార్నింగ్: ఆ చర్యలు తప్పనిసరిగా చేపట్టాల్సిందే: వీడియో కాన్ఫరెన్స్
తుఫాన్ సహాయక చర్యలను పర్యవేక్షించడానికి ముఖ్యమంత్రి వీ నారాయణ స్వామి ఏకంగా సముద్ర తీరం వద్దే మకాం వేశారు. రెవెన్యూ, హోమ్, ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ విభాగం మంత్రులు, అధికారులతో కరైకల్ సముద్ర తీరం వద్ద సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అధికారులు, జాతీయ, రాష్ట్ర ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో ముఖాముఖిగా మాట్లాడారు. తుఫాన్ ప్రభావం అంచనాలకు మించి ఉండొచ్చని భారత వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారని, ప్రాణనష్టాన్ని నివారించడానికి అవసరమైన అన్ని రకాల ముందు జాగ్రత్తలను తీసుకోవాలని సూచించారు.
తుఫాన్ తరువాతి పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొంటామని నారాయణ స్వామి ధీమా వ్యక్తం చేశారు. తుఫాన్ తీరాన్ని దాటిన వెంటనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడానికి అవసరమైన యంత్రాంగాన్ని సన్నద్ధం చేశామని పేర్కొన్నారు. తుఫాన్ వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఆస్తినష్టాన్ని తప్పించుకోలేమని, ప్రాణనష్టాన్ని నివారించడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటున్నామని చెప్పారు. ఏ ఒక్క ప్రాణం పోకుండా ప్రజలను కాపాడుకుంటామని అన్నారు.
Recommended Video
నివార్ తుఫాన్ చెన్నై నగర శివార్లలోని మమళ్లాపురం-పుదుచ్చేరిలోని కరైకల్ మధ్య తీరాన్ని దాటొచ్చంటూ వాతావరణ శాఖ అధికారులు ఇదివరకే అంచనా వేశారు. ప్రస్తుతం బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఉన్న ఈ తుఫాన్ క్రమంగా పశ్చిమం వైపు కదులుతోంది. బుధవారం సాయంత్రం నాటికి మామళ్లాపురం-కరైకల్ మధ్య తీరాన్ని దాటుతుంది. ఆ సమయంలో 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని అధికారులు హెచ్చరించారు. తమిళనాడుతో పాటు పుదుచ్చేరిలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ను జారీ చేశారు.