వణికిస్తున్న ‘ఒఖీ’ తుపాన్.. సైన్యం సాహసోపేత రెస్క్యూ..
తమిళనాడు, కేరళ రాష్ట్రాలను వణికిస్తున్న ఒఖీ తుఫాన్ ఇప్పుడు లక్షద్వీప్ను అతలాకుతలం చేస్తోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇండియన్ నేవీ, ఎన్డీఆర్ఎఫ్, కోస్ట్ గార్డ్ బృందాలు ముమ్మర సహాయక చర్యలు చేపట్టాయి.
న్యూఢిల్లీ: తమిళనాడు, కేరళ రాష్ట్రాలను వణికిస్తున్న ఒఖీ తుఫాన్ ఇప్పుడు లక్షద్వీప్ను అతలాకుతలం చేస్తోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇండియన్ నేవీ, ఎన్డీఆర్ఎఫ్, కోస్ట్ గార్డ్ బృందాలు ముమ్మర సహాయక చర్యలు చేపట్టాయి.
ఒఖీ ప్రభావంతో తమిళనాడులోని తిరునల్వేలి, టుటికొరిన్, విరుద్నగర్, తంజావూర్తో పాటు కేరళలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. ఆయా జిల్లాల్లోని పలు స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు.
వర్షాల కారణంగా పలు రైళ్లు రద్దయ్యాయి. విద్యుత్ సరఫరా నిలిపేయడంతో పలు ప్రాంతాలు అంధకారంలో మునిగిపోయాయి. తుఫాన్ ప్రభావంతో తీర ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ ఆస్తి నష్టం సంభవించింది. వందలాది చెట్లు నేలకూలాయి.
ఈ తుఫాన్ బీభత్సం వల్ల ఇప్పటికే 14 మంది మరణించగా.. అనేక మంది వరదల్లో చిక్కుకున్నారు. మరోవైపు సముద్రంలో చిక్కుకుపోయిన మత్స్యకారులను ఇండియన్ నేవీ అధికారులు అత్యంత సాహసోపేతంగా రక్షిస్తున్నారు.
తాజాగా చేపల వేట కోసం వెళ్లి సముద్రంలో చిక్కుకున్న ఓ వ్యక్తిని ఇండియన్ నేవీ అధికారి రక్షించి తీసుకొచ్చారు. లక్షద్వీప్ తీరం వెంట సముద్రంలో దాదాపుగా 220 మంది వరకూ మత్స్యకారులు చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది.
వీరిని రక్షించడానికి అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కవరత్తి హెలీప్యాడ్ పూర్తిగా నీట మునగడంతో రక్షణ చర్యలు మరింత క్లిష్టంగా మారాయి. మరో 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు.
ఇంత భయానక సముద్రాన్ని ఎన్నడూ చూడలేదు..
కేరళ మత్స్యకారులు ఓఖీ తుపాను సృష్టంచిన బీభత్సంతో అల్లాడిపోతున్నారు. నిరంతరం సముద్రంతోనే సహజీవనం చేసే వీరంతా ఇప్పుడు సముద్రాన్ని చూస్తే భయపడిపోతున్నారు. ఇంత భయానక సముద్రాన్ని ఎన్నడూ చూడలేదని చెప్తున్నారు.
నావికాదళం, వాయుసేన, తీర రక్షక దళం సంయుక్తంగా నిర్వహించిన సహాయక చర్యల్లో సుమారు 200 మంది మత్స్యకారులను కాపాడారు. స్టెఫాన్ అనే మత్స్యకారుడు మాట్లాడుతూ ఓ సహాయక పడవ దూరంగా వెళ్ళిపోతుండటాన్ని చూసి తమకు చాలా ఆందోళన కలిగిందన్నాడు.
ఆ పడవలోని వారికి తమ అరుపులు వినిపించలేదన్నారు. నీటి కల్లోలం తీవ్ర ఆందోళనకు గురి చేసిందని పేర్కొన్నాడు. ఆహారం, తాగు నీరు లేకపోవడంతో చాలా కష్టాలు పడినట్లు తెలిపాడు.
కెరటాలు, తరంగాలు భయానకంగా వచ్చాయని, తమ కళ్ళ ముందే మృత్యు దేవత కనిపించినట్లయిందని చెప్పాడు.. తమ అదృష్టం కొద్దీ అదే సహాయక పడవ మళ్ళీ తమ వద్దకు వచ్చి, తమను కాపాడిందని స్టెఫాన్ నిట్టూర్చాడు.