Cyclone Tauktae: కోస్తా జిల్లాల్లో రెడ్ అలర్ట్: పునరావాస శిబిరాలు సైతం ఏర్పాటు
తిరువనంతపురం: అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడుతోంది. క్రమంగా వాయుగుండంగా మారుతోంది. ఈ నెల 16 నుంచి 18వ తేదీ నాటికి పెను తుఫాన్గా రూపుదాల్చబోతోంది. దీని ప్రభావం కేరళపై తీవ్రంగా ఉండొచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. కర్ణాటక దక్షిణ ప్రాంత జిల్లాలపైనా తుఫాన్ ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ రెండు రాష్ట్రాల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.
Recommended Video
Black Fungus: తెలంగాణలో డేంజర్ బెల్స్: చూపు కోల్పోయిన ముగ్గురు..ఒకరి మృతి
అతి తీవ్ర తుఫాన్గా మారే అవకాశం ఉండటం, దాని దిశ ఎలా మార్చుకుంటుందనే విషయంపై ఇంకా ఎలాంటి స్పష్టత లేనందున పశ్చిమ తీర ప్రాంతంలోని లక్షద్వీప్, గోవా, మహారాష్ట్ర, గుజరాత్ కూడా అలర్ట్ అయ్యాయి. వాతావరణ శాఖ అధికారుల సూచనల మేరకు కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాజధాని తిరువనంతపురం సహా అయిదు తీర ప్రాంత జిల్లాల్లో రెడ్ అలర్ట్ను జారీ చేసింది. ఈ అయిదు జిల్లాల్లో ముందుజాగ్రత్త చర్యగా పునరావాస శిబిరాలను సైతం ఏర్పాటు చేసిందక్కడి ప్రభుత్వం. తుఫాన్ ముప్పు తీవ్రంగా ఉండొచ్చని అనుమానిస్తోన్న ఇతర జిల్లాల పాలన యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది.
తిరువనంతపురం, కొల్లం, పథ్థినంతిట్ట, ఎర్నాకుళం, కొట్టాయంలతో పాటు అళప్పుజ, ఇడుక్కి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భావిస్తున్నారు. కేరళ ఉత్తర ప్రాంత జిల్లాలు కోజికోడ్, కన్నూర్, వాయనాడ్, కాసర్గోడ్ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండాలని సూచించింది. జాతీయ, రాష్ట్ర ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ బలగాలను సన్నద్ధం చేసింది. కరోనా వైరస్ను నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని తుఫాన్ సంభవించిన సమయంలో నిలిపివేయాల్సి ఉంటుందని తిరువనంతపురం జిల్లా కలెక్టర్ నవ్జోత్ ఖోసా తెలిపారు.
ఈ అల్పపీడనం వచ్చే 48 గంటల్లో వాయుగుండంగా.. అనంతరం తుఫాన్గా మారడానికి అనుకూల వాతావరణం ఉందని ఐఎండీ అధికారులు పేర్కొంటున్నారు. దీని ప్రభావంతో గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అలలు ఒక మీటరు కంటే ఎత్తుకు ఎగసిపడే అవకాశాలు ఉన్నాయని అన్నారు. అల్పపీడన తీవ్రతను నిశితంగా గమనిస్తున్నామని తెలిపారు. మత్స్యకారులెవరూ సముద్రంలోకి చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. దీనికి అనుగుణమైన ముందస్తు సూచనలు జారీ చేశారు. ఇప్పటికే సముద్రంలో వేటకు వెళ్లిన వారు వెంటనే వెనక్కి వచ్చేయాల్సి ఉంటుందని చెప్పారు.