పొంచివున్న తుఫాను ముప్పు: ఈ సారి అరేబియా సముద్రంలో!
న్యూఢిల్లీ: మరో తుఫాను ముప్పు పొంచివుంది. ఈ సారి అరేబియా సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం క్రమంగా అల్పపీడనం మారింది. మరింత బలపడి తుఫానుగా రూపాన్ని సంతరించుకోవచ్చని భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. లక్షద్వీప్ గగనతలంలో ఏర్పడిన ఈ ఆవర్తనం క్రమంగా బలపడి అల్పపీడనంగా మారిందని తెలిపారు. ఈ నెల 15వ తేదీ నాటికి ఇది మరింత బలపడి మరో 48 గంటల్లో వాయుగుండంగా మారుతుందని అన్నారు.
సీనియర్ ఐపీఎస్..కేంద్రం నుంచి రిలీవ్! రాష్ట్రంలో కీలక హోదా!
దీని ప్రభావంతో నైరుతి రుతుపవనాలు మరింత చురుగ్గా కదలుతాయని తెలిపారు. రానున్న రోజుల్లో కేరళ, కర్ణాటకల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.అరేబియా సముద్రంలో అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే క్రమంలో కేరళ, కర్ణాటక, తమిళనాడు తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ నెల 13 వరకు కేరళ, కర్ణాటక తీర ప్రాంత జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తాయని అన్నారు.
అల్పపీడన ప్రభావం వల్ల లక్షద్వీప్ నుంచి కర్ణాటక వరకు తీర ప్రాంతాల వరకు సముద్ర ఉపరితలం మీదుగా బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయని అధికారులు తెలిపారు. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు చేపలవేటకు వెళ్ల కూడదని హెచ్చరించారు. దీని ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశాలు లేకపోలేదని, తీర ప్రాంత రాష్ట్రాలైన కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్రలకూ భారీ వర్షాలకు అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.