సంచలనం: టాటాలోని అన్ని గ్రూప్లకు మిస్త్రీ రాజీనామా, అందుకేనని..
టాటా గ్రూపుకు చెందిన లిస్టెడ్ కంపెనీల నుంచి తప్పుకుంటున్నట్లు సైరస్ మిస్త్రీ సోమవారం ప్రకటించారు.
ముంబై: టాటా - మిస్త్రీ వార్లో సోమవారం నాటు కీలక పరిణామం చోటు చేసుకుంది. టాటా సన్స్ చైర్మన్గా ఆయనను తొలగించినప్పటి నుంచి ఆసక్తికర పరిణామాలు చూస్తున్నాం. ఈ రోజు సైరస్ మిస్త్రీ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
రెండుసార్లూ ఆశ్చర్యమే: మిస్త్రీకి ఉద్వాసన, టాటా తాత్కాలిక చైర్మన్గా రతన్
టాటా గ్రూపుకు చెందిన లిస్టెడ్ కంపెనీల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే తన పోరాటాన్ని మరింత పెద్ద వేదికకు మార్చుతున్నట్లు ప్రకటించారు. గత ఐదు దశాబ్దాలుగా తన కుటుంబం టాటా గ్రూపుకు ఎనలేని సేవలు అందించిందని ఈ సందర్భంగా సైరస్ మిస్త్రీ తెలిపారు.
కంపెనీలను దారిలో పెట్టేందుకు తాను ప్రయత్నించానని, కానీ రతన్ టాటా తనను అడ్డుకున్నారని మిస్త్రీ చెప్పారు. తనను చట్టవిరుద్ధంగా తొలగించారన్నారు. గత ఎనిమిది వారాలు టాటా గ్రూపు సమాధానం కోసం ఎదురుచూశానన్నారు.
కానీ ఫలితం లేదన్నారు. ఈ కారణంగా తాను గ్రూపు రక్షణ కోసం న్యాయ పోరాటానికి పూనుకున్నానని చెప్పారు. టాటా గ్రూపులో ఇటీవలి పరిణామాలు తనను బాధించాయని, ఇక ముందు పోరాటానికి మరింత పదును పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు.
కాగా, తాజా నిర్ణయంతో మొత్తం సంస్థలకు మిస్త్రీ రాజీనామా చేసినట్లైంది. టాటా సన్స్, టాటా స్టీల్, టాటా కెమెకల్స్, టాటా మోటార్స్, టాటా పవర్, ఇండియన్ హోటల్స్లోని అన్ని పదవులకు రాజీనామా చేస్తూ మిస్త్రీ పై ప్రకటన విడుదల చేశారు.
మిస్త్రీని టాటా గ్రూప్ ఛైర్మన్ పదవి నుంచి తప్పించాలని అక్టోబర్ 24న జరిగిన బోర్డు సమావేశంలో టాటా సన్స్ డైరెక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. ఇది కార్పొరేట్ ప్రపంచంలో సంచలనం సృష్టించింది.
అనంతరం రతన్ టాటా తాత్కాలిక ఛైర్మన్ కొనసాగారు. ఈ నేపథ్యంలో టాటా గ్రూపులోని వివిధ కంపెనీల్లోని పదవుల నుంచి మిస్త్రీని తప్పిస్తూ వచ్చారు. ఇందుకోసం అత్యవసర సర్వసభ్య సమావేశాలను (ఈజీఎం) సైతం నిర్వహించారు. ఈ నేపథ్యంలో అటు టాటా గ్రూప్, ఇటు మిస్త్రీ వర్గాలు ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో ఆరోపణలకు దిగారు.
సైరస్ మిస్త్రీకి మరో షాక్: టాటా ఇండస్ట్రీస్ డైరెక్టర్గా ఔట్
మిస్త్రీపై విశ్వాసం కోల్పోవడం వల్లే ఆయన్ను ఛైర్మన్ పదవి నుంచి తొలగించినట్లు రతన్ టాటా ఆరోపించగా, టాటా గ్రూప్లో నిర్ణయాధికారాలన్నీ ఒకే వ్యక్తి చేతిలో ఉన్నాయని మిస్త్రీ విమర్శలు గుప్పించారు. డిసెంబర్ 13న జరిగిన ఈజీఎంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) నుంచి మిస్త్రీని తప్పించారు. ఇక ఈ వారంలో నాలుగు ఈజీఎంలు జరగనున్నాయి.
వీటి ద్వారా ఆయా కంపెనీల నుంచి మిస్త్రీని తప్పించాలని తీర్మానించారు. ఇండియన్ హోటల్స్ కో లిమిటెడ్(ఐహెచ్సీఎల్), టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా కెమికల్స్ కంపెనీల ఈజీఎంలు డిసెంబర్ 20-23 తేదీల్లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో టాటా గ్రూప్లోని అన్ని కంపెనీలకు మిస్త్రీ రాజీనామా చేశారు.