సుప్రీంకోర్టు విచారణకు ముందే.. సైరస్ మిస్త్రీ సంచలన నిర్ణయం
న్యూఢిల్లీ: టాటా సన్స్ కంపెనీ మాజీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఓవైపు సుప్రీంకోర్టులో టాటాసన్స్ సవాలు పిటిషన్పై విచారణ జరుగుతుండగా... తాను టాటా సన్స్ కంపెనీకి ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా తిరిగి బాధ్యతలు స్వీకరించబోనని ఆయన స్పష్టం చేశారు.
టాటా బాధ్యతలు చేపట్టబోనంటూ..
రికార్డుల్లో ఉన్న అన్ని విషయాలను సమీక్షించిన తర్వాత తనను తొలగించిన పద్ధతి చట్టవిరుద్ధమైనదని జాతీయ కంపెనీ లా అప్పీలేట్ ట్రైబ్యునల్(ఎన్సీఎల్ఏటీ) గుర్తించిందని తెలిపారు. ఎన్సీఎల్ఏటీ ఆదేశాలపై తనకు గౌరవం ఉందన్న సైరస్ మిస్త్రీ.. అయితే టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టాలని అనుకోవడం లేదని తేల్చి చెప్పారు.
న్యాయ పోరాటం అందుకే..
టాటా గ్రూప్ నాయకత్వం గత మూడేళ్లుగా మైనారిటీ వాటాదారుల హక్కులపై అంతగా గౌరవం చూపడం లేదని తెలిపారు. టాటా గ్రూప్స్కు తనకు మధ్య న్యాయ పోరాటం కేవలం మైనారిటీ వాటాదారుల హక్కులను కాపాడటం కోసమేనని సైరస్ మిస్త్రీ తెలిపారు.
మిస్త్రీని తిరిగి నియమిస్తూ కంపెనీ లా..
ఎన్సీఎల్ఏటీ ఉత్తర్వులు తనకు అనుకూలంగా వచ్చినప్పటికీ టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ సహా టీసీఎస్, టాటా టెలీసర్వీసెస్, టాటా ఇండస్త్రీస్లో డైరెక్టర్ పదవుల కోసం పాకులాడటం లేదని స్పష్టం చేశారు. కాగా, టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా సైరస్ మిస్త్రీని తిరిగి నియమిస్తూ ఎన్సీఎల్ఏటీ ఉత్తర్వులు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ తీర్పును సవాలు చేస్తూ.. రతన్ టాటా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
6న సుప్రీంకోర్టులో విచారణ
ఎన్సీఎల్ఏటీ ఉత్తర్వులు టాటా గ్రూప్ కంపెనీల్లో కార్పొరేట్ గవర్నెన్స్తోపాటు సంస్థలో దశాబ్దాల తరబడి నెలకొన్న విధానాలను దెబ్బతీసేలా ఉన్నాయని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో సంస్థ పేర్కొంది. సుప్రీంకోర్టులో ఈ పిటిషన్పై సోమవారం విచారణ జరగనుంది.