ఎగ్జిట్ పోల్స్ ప్రభావం: నష్టాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్లు
ముంబై: ఐదురాష్ట్రాల్లో ఎన్నికలు ముగిశాయి. ఇక ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో స్టాక్ మార్కెట్లు డీలా పడ్డాయి. రాజస్థాన్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో బీజేపీ కాంగ్రెస్ల మధ్య టైట్ ఫైట్ ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయడంతో సోమవారం నష్టాలతో మార్కెట్లు ప్రారంభమైయ్యాయి. ఒకవేళ బీజేపీ ఈ రెండు రాష్ట్రాల్లో కూడా మెరుగైన ఫలితాలు చూపగలిగితే మార్కెట్లు పాజిటివ్ ట్రెండ్లో నడుస్తాయని అనలిస్టులు చెబుతున్నారు.
మార్కెట్లపై ఎగ్జిట్ పోల్స్ ప్రభావం
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అమెరికా ఈక్విటీ మార్కెట్లు స్వల్పంగా పడిపోవడం, అమెరికా చైనాల మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధం కారణంగా సోమవారం మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. రాజస్తాన్లో బీజేపీ ఓటమి తథ్యం అని సర్వేలు వెల్లడించడం మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో హోరా హోరీ పోరు ఉండటం వల్ల ఆ ప్రభావం మార్కెట్లపై పడి ఉంటుందని ప్రముఖ మార్కెట్ అనలిస్టు సంజీవ్ ప్రసాద్ తెలిపారు. అంతేకాదు అమెరికా మార్కెట్లలో ఒడిదుడుకులు, మార్కెట్లు అనుకున్న దానికంటే ఆయిల్ ధరల్లో పెరుగుదల కూడా మార్కెట్లు డీలా పడేందుకు కారణం అయి ఉంటాయని చెప్పారు.
రెండు రాష్ట్రాల్లో బీజేపీ ఓటమి పాలైతే మార్కెట్లు కుదేలవడం ఖాయం
ఎన్నికలు లెక్కింపు మంగళవారం జరగనుండగా... ఒకవేళ మూడు పెద్ద రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల్లో బీజేపీ ఓటమి చవిచూస్తే మార్కెట్లు కుదేలవడం ఖాయమని మరికొందరు నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ నిజంగానే మూడు రాష్ట్రాల్లో బీజేపీ ఓటమి చవిచూస్తే ఆ మూడు రాష్ట్రాల్లో రైతుల ఆగ్రహంతోనే ఓటమి మూటగట్టుకుందని భావించాల్సి ఉంటుందన్నారు నొమురా. ఈ మూడు రాష్ట్రాల్లో ఎక్కువగా వ్యవసాయం చేసే వారి జనాభే ఎక్కువగా ఉందన్నారు.
అమెరికా మార్కెట్లు ఒడిదుడుకులు వల్లే నష్టాలు
మరోవైపు మార్కెట్లు నష్టాల బాట పట్టడానికి దేశంలో జరిగిన ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు నిర్మల్ బంగ్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ సీఈఓ రాహుల్ అరోరా. అమెరికా మార్కెట్లు ఒడిదుకుల వల్లే భారత మార్కెట్లు నష్టాలు చూస్తున్నాయని చెప్పారు. అమెరికా చైనా దేశాల మధ్య వాణిజ్య యుద్ధం ఇప్పుడప్పుడే ఆగేలా కనిపించడంలేదన్న అనలిస్టులు ఈ రెండు దేశాలు ఇలానే కొనసాగితే ప్రపంచ మార్కెట్ల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారుతుందని చెబుతున్నారు.