త్వరలో జయలలిత ఆస్తులు వేలం: కర్ణాటక పక్కా ప్లాన్ ఇదే !
బెంగళూరు: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో రూ. 100 కోట్ల అపరాధ రుసుం వసూలు చెయ్యడానికి కర్ణాటక ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. జయలలిత అనారోగ్యంతో మరణించడంతో ఆమె శిక్షను సుప్రీం కోర్టు రద్దు చేసింది.
అయితే జయలలితకు విధించిన అపరాధ రుసుం రూ. 100 కోట్లు వేరే రూపంలో వసూలు చెయ్యాలని సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తీర్పును పున:సమీక్షించాలని కోరుతూ కర్ణాటక ప్రభుత్వం తరపున మంగళవారం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది.
అమ్మ చనిపోయినా ?
ముద్దాయి చనిపోయిన నేపథ్యంలో జయకు విధించిన అపరాధ రుసుం వసూలు చేసేందుకు రాజ్యంగంలో ఎక్కడా పేర్కొనలేదని కర్ణాటక వేసిన పిటిషన్ సారాంశం. ఈ పిటిషన్ త్వరలో సుప్రీం కోర్టులో విచారణకు రానుంది.
చిన్నమ్మ అండ్ కో
జయలలిత ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో కోర్టు ఆదేశాల మేరకు జయ, శశికళ, ఇళవరసి, దివాకరన్ ల నుంచి తమిళనాడు ప్రభుత్వానికి రూ. 130 కోట్ల అపరాద రుసుం వసూలు చేయాల్సి ఉంది.
ఆస్తులు వేలం వెయ్యండి ?
జయలలిత మరణించడంతో ఆమెకు చెందిన ఆస్తులు వేలం వేసి రూ. 100 కోట్ల అపరాద రుసుం వసూలు చేయాల్సి ఉంది. శశికళ, ఇళవరసి, దివాకరన్ ల నుంచి రూ. 30 కోట్ల అపరాధ రుసుం వసూలు చెయ్యాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
డీఎంకే పార్టీ న్యాయవాదులు
జయలలిత అక్రమాస్తుల కేసు విషయంలో డీఎంకే ప్రధాన కార్యదర్శి అన్బలగన్ తరపున న్యాయవాదులు బాలాజీ సింగ్, తామరై సెల్వన్ మాట్లాడుతూ బెంగళూరు ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు ఖరారు చేసిందని గుర్తు చేశారు.
ఆస్తులు వేలం వేస్తే సరిపోతోంది
జయలలిత మరణించినా ఆమెకు విధించిన రూ. 100 కోట్ల అపరాధ రుసుం వసూలు చెయ్యాల్సి ఉందని డీఎంకే పార్టీ న్యాయవాదులు అంటున్నారు. జయలలిత మరణించినా ఆమెకు విధించిన అపరాధ రుసుం ఆమె ఆస్తులు వేలం వేసి వసూలు చెయ్యాలని న్యాయమూర్తి వివరంగా తెలిపారని గుర్తు చేశారు.
కర్ణాటక ప్రభుత్వానికి రూ. 12. 50 కోట్లు ఖర్చు
జయలలిత ఆస్తులు త్వరలో వేలం వెయ్యాలనే ఉద్దేశంతోనే కర్ణాటక ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసిందని డీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి అన్బలగన్ తరపున న్యాయవాదులు బాలాజీ సింగ్, తామరై సెల్వన్ చెప్పారు. జయలలిత అక్రమాస్తుల కేసు ఖర్చుల నిమిత్తం తమిళనాడు ప్రభుత్వం త్వరలో రూ. 12. 50 కోట్లను కర్ణాటక ప్రభుత్వానికి ఇస్తోందని వారు వివరించారు.