జైలుకు జయలలిత: ఖైదీ నెం.7402, తొలి స్త్రీ సిఎం
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు ప్రత్యేక న్యాయస్థానం కఠిన శిక్ష విధించడంతో ఆమె తమ పదవికి ఏ క్షణాన్నయినా పదవికి రాజీనామా చేయవచ్చునని తెలుస్తోంది. ఈ జైలుశిక్షతో ప్రజా ప్రతినిధిగా ఆమె అర్హత కోల్పోయినట్టయ్యింది. నాలుగేళ్లపాటు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పడంతో జయ అభిమానులు ఆగ్రహంతో రోడ్లపైకి వచ్చారు. ముగ్గురు అభిమానులు జయ ఇంటిముందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అయితే వారి యత్నాలను సకాలంలో విరమింపజేశారు.
చెన్నై వీధులలో తిరుగుతున్న బస్సులపై అన్నా డిఎంకె అభిమానులు రాళ్లు విసరడంతో కొన్ని బస్సులు దెబ్బతిన్నాయి. బస్సులపై అభిమానులు ప్రతాపం చూపడంతో కర్నాటకనుంచి తమిళనాడుకు బస్సు సర్వీసులను రద్దు చేశారు. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు, నెల్లూరు జిల్లాలనుంచి కూడా తమిళనాడుకు బస్సు సర్వీసులను రద్దు చేశారు.
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు ప్రత్యేక న్యాయస్థానం కఠిన శిక్ష విధించడంతో ఆమె కోర్టు ఆవరణలోనే స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కోర్టు తీర్పు వెలువడిన అనంతరం పాలనాపరంగా తీసుకోవలసిన చర్యల గురించి జయలలిత ముందుగానే తమకు విశ్వాసపాత్రులైన అధికారులతో చర్చించినట్టు తెలుస్తోంది. అవినీతి ఆరోపణల కేసు కారణంగా పదవిని కోల్పోయిన తొలి మహిళా ముఖ్యమంత్రి జయలలితనే.
నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష విధించడంతో ఈ ప్రత్యేక న్యాయస్థానంలో జయలలిత బెయిలు పొందే అవకాశం లేదని అంటున్నారు. మూడేళ్ల లోపు జైలు శిక్ష గనక పడితే ఏ కోర్టు అయితే శిక్ష విధించిందో అదే కోర్టు బెయిలు కూడా మంజూరు చేయవచ్చు. అయితే ఈ ప్రత్యేక న్యాయస్థానం ఏర్పడిందే ప్రత్యేక పరిస్థితులలో కాబట్టి జయ బెయిలుకు బెంగుళూరు హై కోర్టులో ప్రయత్నించవచ్చా, లేక సుప్రీం కోర్టుకు వెళ్లాలా అన్న అంశంపై ఇంకా స్పష్టత రాలేదు.
ఇపడు జయలలితకు బెయిలు రావాలన్నా కనీసం వారం పది రోజులు పట్టవచ్చునని అంటున్నారు. తీర్పు వెలువడిన తర్వాత పోలీసులు కస్టడీలోకి తీసుకుని ఆమెను పరప్పన అగ్రహారంలోని జైలుకు తీసుకువెళ్లారు. అక్కడ ఆమెకు వైద్య చికిత్సలు నిర్వహించారు. కళ్లు తిరుగుతున్నట్లు ఆమె ఫిర్యాదు చేశారు. దీంతో జైలులోని ఆస్పత్రిలోనే ఆమెకి వైద్య పరీక్షలు నిర్వహించారు. జయలలితతో పాటు శశికళ, సుధాకరన్, ఇలవరసను జైలుకు తరలించారు. గవర్నర్ కె. రోశయ్య పరిస్థితిని సమీక్షించారు.