తండ్రి దొంగ, కొడుకులేమో డాక్టర్, ఇంజనీర్, ఎలా పట్టుబడ్డాడంటే?
ముంబై: ముంబై పోలీసులు ఓ వింత సంఘటనతో షాక్కు గురయ్యారు. ఓ వ్యక్తి దొంగతనాలు చేస్తున్నాడు. అయితే అతని కొడుకులు మాత్రం సమాజంలో మంచి హోదాలో ఉన్నారు. రోడ్లపై వెళ్ళే వాహనాలను ఆపి అందులోని ప్రయాణీకుల దృష్టిమరల్చి దొంగతనాలకు పాల్పడే వ్యక్తిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. అయనను విచారించిన సమయంలో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి.
ముంబైలోని నవీ ముంబై ప్రాంతంలో ముదలియార్ నివాసం ఉంటున్నాడు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలున్నారు. ముదలియార్ పెద్ద కొడుకు నవీ ముంబైలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో డాక్టర్. రెండో కోడుకు ఇంజనీర్గా పనిచేస్తున్నాడు.మూడో కొడుకు హోటల్ మేనేజ్మెంట్ కోర్సును అభ్యసిస్తున్నాడు.
అయితే ముదలియార్ దొంగతనాలు చేయడమే వృత్తిగా అలవాటు చేసుకొన్నాడు. వాహనాల్లో వస్తువులను దొంగిలించే దొంగల ముఠాకు నాయకుడుగా ముదలియార్ వ్యవహరిస్తున్నాడు.
ముంబైలోని పలు వాహనాల్లోని వారి దృష్టి మళ్ళించి వాహనాల్లోని వస్తువులను దొంగిలించేవాడు ముదలియార్. ముదలియార్ అసలు రవిచంద్రన్. ఇటీవల ఓ మహిళ తన వాహనంలో చోటు చేసుకొన్న దొంగతనం గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ ఫిర్యాదు ఆధారంగా విచారణ చేసిన పోలీసులకు ముదలియార్ పట్టుబడ్డాడు.
అయితే తొలుత ముదలియార్ నోరు విప్పలేదు. తనకు తమిళం మాత్రమే వచ్చని ఆయన చెప్పారు. అంతేకాదు హిందీ రాదన్నాడు.తాను తమిళనాడుకు చెందినవాడిగా చెప్పుకొన్నాడు.
ముంబైలో వాహనాల్లో దొంగతనాలకు పాల్పడేవారిని టక్ టక్ ముఠాగా పిలుస్తారు. రోడ్డు మీద ప్రయాణిస్తున్న కార్లను ఆపి ఇంధనం లీక్ అవుతోందని వాహన యజమానులను నమ్మించే ప్రయత్నం చేస్తారు. అంతేకాదు వారిని మాటల్లోకి దించి వాహనాల్లో ఉన్న వస్తువులను దొంగిలిస్తారు.
ఇటీవల కాలంలో దక్షిణ ముంబైలోని మహిళ కారులో ప్రయాణిస్తున్న కారును ఆపి ముదలియార్ ముఠా దోచుకొంది. అయితే బాధిత మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేస్తే ముదలియార్ పట్టుబడ్డారు. ముదలియార్తో పాటు మరో నలుగురు సభ్యులు కూడ ఈ ముఠాలో ఉన్నారు. వారిని కూడ పోలీసులు అరెస్ట్ చేశారు.
తొలుత ముదలియార్ నోరు విప్పలేదు. తమిళం తప్ప మరో భాష రాదని పోలీసులను నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ, పోలీసులు తమదైన శైలిలో విచారణ జరిపారు. ఈ విచారణలో ముదలియార్ అసలు విషయాన్ని బయటపెట్టారు.