దాద్రి ఘటన: ఆ ఇంట్లో దొరికింది మేక మాంసమే..!
లక్నో: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దాద్రి ఘటనకు సంబంధించిన నివేదికను సోమవారం అక్కడి అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో బాధితుల ఇంట్లోని రిఫ్రిజరేటర్లో దొరికిన మాంసం మేక మాంసమేనని, పశుమాంసం కాదని చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ ఇచ్చిన నివేదిక ద్వారా వెల్లడయ్యింది.
అంతేకాదు అక్కడి గౌతం బుద్ధనగర్ పోలీసులు వారం రోజుల క్రితం దాఖలు చేసిన ఛార్జిషీటులో సైతం ‘బీఫ్' అనే పదాన్ని చేర్చలేదు. దీంతో ఇప్పుడు ఈ నివేదికకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఉత్తరప్రదేశ్లోని దాద్రికి సమీపంలో ఉన్న బిసారా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
గత సెప్టెంబర్ 28న పశు మాంసం ఇంట్లో దాచుకుని తింటున్నాడనే పుకార్లతో 52 ఏళ్ల మహ్మద్ అఖ్లక్ను ఇంట్లోంచి లాక్కుని వచ్చి కొందరు వ్యక్తులు తీవ్రంగా కొట్టారు. దీంతో తీవ్రంగా గాయపడిన అతడు మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
అఖ్లక్ కుమార్తె ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ వారం నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు 15మందిపై పోలీసులు ఛార్జిషీటు దాఖలు చేశారు. స్థానికి బీజేపీ నేత సంజయ్ రాణా రెచ్చగొట్టడంతో ఆగ్రహం చెందిన అల్లరి మూక దాడికి పాల్పడిందని పోలీసులు చార్జిషీట్లో పేర్కొన్నారు.