'బీఫ్' పదం లేదు: దాద్రి ఘటనపై కేంద్రానికి నివేదిక
లక్నో: దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్లోని దాద్రి ఘటనపై ఆ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదిక అందజేసింది. నిషేధించిన జంతు మాంసం తిన్నాడనే అనుమానం వల్లనే మహమ్మద్ అక్లఖ్ అనే 52 ఏళ్ల వ్యక్తి చనిపోవడానికి కారణమైందని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నివేదికలో పేర్కొంది.
ఉత్తరప్రదేశ్లోని దాద్రి సమీపంలోని ఓ గ్రామంలో మహమ్మద్ అక్లఖ్ అనే 52 ఏళ్ల వ్యక్తిని పశుమాంసం తిన్నాడనే అనుమానంతో గ్రామస్థులు కొట్టి చంపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కేంద్రం నివేదిక కోరగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నివేదిక సమర్పించింది. అయితే నివేదికలో ఎక్కడా 'బీఫ్' అనే పదం వాడలేదు.
నివేదికలో దాద్రి ఘటన అనంతరం గ్రామంలో పర్యటించిన పలువురు రాజకీయ నేతల పేర్లు కూడా అందులో పేర్కొంది. దాద్రి ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామస్తుల దాడిలో గాయపడ్డ అక్లఖ్ కుమారుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
మరోవైపు హత్యకు గురైన మహ్మద్ అక్లఖ్ పెద్ద కుమారుడు మహ్మద్ సర్తాజ్ భారత వైమానిక దళంలో ఎయిర్మ్యాన్గా పని చేస్తున్నాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సోదరునికి అండగా ఉన్నాడు. స్థానిక బీజేపీ నేత కొడుకు ఈ ఘటనకు పురిగొల్పాడనే వార్తలు మీడియాలో వస్తున్నాయి.
బాధిత కుటుంబ సభ్యులు ఇటీవలే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ను కలవగా ఆయన కుటుంబానికి రూ. 30 లక్షల ఆర్ధిక సహాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనపై సమాజ్ వాదీ పార్టీకి చెందిన కొందరు నేతలు మండిపడుతున్నారు.
బీజేపీ పక్కా ప్రణాళికతో చేసిన కుట్రగా ఆ పార్టీ నేతలు ఆరోపించారు. గ్రామాన్ని సందర్శించడానికి రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం తెలపడం లేదని, గ్రామాన్ని సందర్శించి అక్కడ జరిగిన అసలు నిజాన్ని ప్రజలు తెలుసుకోవాలని సూచించారు.
బాధితుడి కుటుంబ సభ్యులు తమను లక్నోలో కలిశారని, ఆ సందర్భంగా వారికి 45 లక్షల రూపాయల పరిహారంతోపాటు భద్రతతో కూడిన ఇళ్లు ఇస్తామని భరోసా ఇచ్చినట్టు సమాజ్ వాదీ పార్టీ నేత చెప్పారు.
దాద్రి ఘటనకు సంబంధించి మరో ఇద్దరి నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య 8 కి చేరింది. తాజాగా అరెస్టయిన ఇద్దరిలో విషాల్ అనే వ్యక్తి స్థానిక బీజేపీ కుమారుడు కాగా, రెండో వ్యక్తి శివమ్.