రూ.కోటి కట్టాలట, రోజుకు రూ.300 సంపాదించే కూలికి ఐటీ నోటీసు, పోలీసులకు ఫిర్యాదు
అప్పుడప్పుడు చిత్ర, విచిత్రాలు జరుగుతుంటాయి. పూరి గుడిసెకు లక్షల్లో కరెంట్ బిల్లు, పేదోడికి ఐటీ నోటీసు ఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. మహారాష్ట్రలో కూడా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగుచూసింది. ఓ దినసరి కూలీకి రూ.కోటి కట్టాలని నోటీసు వచ్చింది. దీంతో అతను తనకు ఐటీ నోటీసు రావడం ఏంటో అని ఆశ్చర్యపోయారు. మరోసారి కూడా నోటీసు రావడంతో.. చెసేదేమీ లేక పోలీసులను ఆశ్రయించాడు.
దినసరి కూలీ..
అంబివలీలో బావుసాహెబ్ అహీర్ అనే దినసరి కూలీ ఉంటున్నారు. తన బంధువల ఇంట్లో ఉంటూ.. రోజు కూలీ పనులు చేస్తున్నాడు. రోజు పనిచేస్తే అతనికి వచ్చే కూలీ రూ.300. అయితే అతనికి రూ.1.05 కోట్లు కట్టాలని నోటీసు రావడంతో భయాందోళనకు గురయ్యాడు. విషయమేమిటంటే పెద్ద నోట్ల రద్దు సమయంలో అహిర్ బ్యాంకు ఖాతాలో రూ.58 లక్షలు డిపాజిట్ చేశారని ఆదాయపు పన్ను శాఖ అధికారులు చెప్తున్నారు.
రూ.58 లక్షల డిపాజిట్..
పెద్ద నోట్ల రద్దు సమయంలో అహిర్ బ్యాంకు ఖాతాలో రూ.58 లక్షలు డిపాజిట్ చేసినట్టు ఐటీ అధికారుల వద్ద ధ్రువీకరణ పత్రాలు ఉన్నాయి. అయితే తనకు బ్యాంకు ఖాతానే లేదని అహిర్ వాదిస్తున్నాడు. దీనికి సంబంధించి గతేడాది సెప్టెంబర్లో అహిర్కు ఐటీ శాఖ నోటీసులు జారీచేసింది. పొరపాటున వచ్చిందెమోనని అతను ఊరుకొన్నాడు. కానీ ఈ నెల 7వ తేదీన కూడా మరోసారి నోటీసులు రావడంతో భయపడ్డారు.
ఫేక్ అకౌంట్
ఏం చేయాలని ఆలోచించాడు. వెంటనే ఐటీ అధికారులను, పోలీసులను సంప్రదించాడు. తన వద్ద ఉన్న ప్యాన్ కార్డు కూడా చూపించాడు. అయితే బ్యాంకు ఖాతా తెరిచే సమయంలో అందజేసిన ఫోటో, నకిలీ సంతకాలు ఉన్నట్టు గుర్తించారు. కానీ రెండోసారి నోటీసులు అహిర్కు ఐటీ శాఖ అధికారులు పంపించారు. దీంతో చేసేదేమీ లేక పోలీసులను ఆశ్రయించారు. అహిర్ ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
రెండోసారి..
తన పేరుతో తప్పుడు బ్యాంకు ఖాతా ప్రారంభించారని అహిర్ చెప్తున్నారు. రెండోసారి తనకు నోటీసులు పంపించడంపై అహిర్ ఆందోళన చెందారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశానని, తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు.