సెల్యూట్: ఒక్కకాలితో పరుగు తీసి రైలు ప్రమాదానికి బ్రేక్: చీకటి రోజు, నరాల బలహీనత!
బెంగళూరు: అతను సాధారణ వ్యక్తి. ప్రతి రోజూ కూలిపని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. నరాల బలహీనత కారణంగా దెబ్బతిన్న కుంటికాలితో రోజూ కాలం వెల్లదీస్తున్నాడు. కాని అనేక మంది ప్రాణాలు కాపాడి నేడు అందరి దగ్గర సెల్యూట్ కొట్టించుకుంటున్నాడు. కాలు సక్రమంగా పని చెయ్యాలంటే ప్రతిరోజూ ఉదయం కంకర రాళ్ల మీద వాకింగ్ చెయ్యాలని వైద్యులు సూచించారు.
ఒక రోజు రైలు పట్టాల మీద ఉన్న కంకర రాళ్ల మీద వాకింగ్ చేస్తున్న ఆయన రైలు పట్టాలు చీలిపోయాయి అని గుర్తించి 6 కిలోమీటర్లు పరుగుతీసి పెద్ద రైలు ప్రమాదం జరగకుండా అధికారులకు సమాచారం ఇచ్చి ఇప్పుడు శభాష్ అనిపించుకుంటున్నాడు.
ఇంజక్షన్లు, మందులు
కర్ణాటకలోని ఉడిపి ప్రాంతానికి చెందిన కృష్ణ పూజారి (53) ఒక సంవత్సరం నుంచి నరాల బలహీనతతో బాధపడుతూ నిత్యం ఇంజక్షన్లు, మందులు తీసుకుంటూ చికిత్స చేయించుకుంటున్నాడు. వైద్యుల సలహామేరకు కాళ్లకు చెప్పులు లేకుండా కంకర రాళ్ల మీద ఉదయం వాకింగ్ చేస్తున్నాడు. ఉడిపి సమీపంలోని కూరంగ్రపాడి రైల్వే ట్రాక్ సమీపంలో జనసంచారం తక్కువగా ఉండటంతో అదే ప్రాంతంలో నిత్యం కృష్ణ పూజారి వేకువ జామున వాకింగ్ చేస్తున్నాడు.
చీలిపోయిన పట్టాలు
కూరంగ్రపాడిలోని బ్రహ్మాస్థానం సమీపంలో ఉదయం 6.30 గంటల సమయంలో కృష్ణ పూజారి రైల్వేట్రాక్ లోని కంకర మీద వాకింగ్ చేస్తున్నాడు. ఆ సమయంలో రైల్వే పట్టాలు చీలిపోయిన విషయం గుర్తించిన కృష్ణ పూజారి ఆందోళనకు గురైనాడు. ఇటువైపు రైలు వస్తే కచ్చితంగా ప్రమాదం జరుగుతుందని అనుమానించాడు. కాలు సరిగా పని చెయ్యడం లేదని తెలిసినా కృష్ణ పూజారి కేవలం 40 నిమిషాల్లో ఆరు కిలోమీటర్లు పరుగుతీసి రైల్వే స్టేషన్ చేరుకున్నాడు.
అధికారులు అలర్ట్
రైలు పట్టాలు చీలిపోయిన విషయం తెలుసుకున్న రైల్వే సిబ్బంది పై అధికారులకు సమాచారం ఇచ్చారు. అటు వైపు వచ్చే రైళ్లను నిలిపివేశారు. కృష్ణ పూజారితో కలిసి రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పట్టాల మరమత్తుల పనులు చేశారు. అప్పటికే గోవా నుంచి బయలుదేరిన రైలును అధికారులు నిలిపివేశారు.
నెలమంగల ప్రమాదం
కాలు నోప్పితో బాధపడుతున్న కృష్ణ పూజారి రైలు ప్రమాదం జరకుండా 6 కిలోమీటర్లు పరుగుతీసి సమాచారం ఇచ్చాడని తెలుసుకున్న పలువురు ఆయన్ను అభినందింస్తున్నారు. సరైన సమయంలో కృష్ణ పూజారి సమాచారం ఇవ్వకుంటే పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని అధికారులు ఆంటున్నారు.
చీకటి రోజు గుర్తుంది
కాలు నోప్పి భరించి రైల్వే అధికారులు సమాచారం ఇచ్చినా తనకు ఎలాంటి బాధలేదని కృష్ణ పూజారి అంటున్నాడు. 35 ఏళ్ల క్రితం నెలమంగలలో జరిగిన రైలు ప్రమాదం కళ్లారా చూశానని, అలాంటి చీకటి రోజు మళ్లీ ఎదురుకాకుండా చూడటానికి కాలు నొప్పి భరించి అధికారులకు సమాచారం ఇచ్చానని కృష్ణ పూజారి అంటున్నారు. పెద్ద రైలు ప్రమాదం జరగకుండా అడ్డుకున్న కృష్ణ పూజారికి అందరూ సలామ్ చేస్తున్నారు.