డైరీ చెప్పిన నిజాలు: గౌరీ లంకేష్తో పాటు మరో 36 మంది వీరి టార్గెట్
ప్రముఖ సీనియర్ జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఆమె హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న అమోల్ కాలేకు సంబంధించిన డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ డైరీలో పలు ఆసక్తికర విషయాలు బయటకొచ్చాయి. ఒక్క గౌరీ లంకేష్ హత్యనే కాదు... ఈ ముఠా మరో 36 మందిని హత్య చేసేందుకు కుట్రపన్నిన్నట్లు డైరీలోని విషయాలను బట్టి తెలుస్తోంది.
డైరీలో ఉన్నట్లుగా... చాలామంది మహారాష్ట్రకు చెందినవారే ఈ ముఠా టార్గెట్గా తెలుస్తోంది. వీరందరిని హత మార్చేందుకు మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల నుంచి దాదాపు 50 మంది ప్రొఫెషనల్ షూటర్స్ ను నియమించుకునేందుకు రంగం సిద్ధం చేసినట్లుగా సమాచారం. కొందరికి అప్పటికే ఆయుధాలు ఎలా వాడాలో ట్రైనింగ్ కూడా ఇచ్చినట్లు డైరీలో సమాచారం ఉంది. తుపాకులు, ఎయిర్ గన్స్, పెట్రో బాంబులను ఎలా తయారు చేయాలో బెల్గాం, హుబ్లీ, పూణేలలో ట్రైనింగ్ ఇస్తున్నట్లు తెలుస్తోంది.
కర్నాటక, మహారాష్ట్రలో జరిగే హిందూ సభలకు సమావేశాలకు ట్రైనింగ్ అయిన వారిని కాలే పంపేవాడని డైరీలో రాసి ఉంది. అక్కడికి వెళ్లి వారిని మరింత కఠినతరమైన హిందూ వాదిగా మార్చేవాడని తెలుస్తోంది. గౌరీ లంకేష్ను హత్య చేసినవారిలో ప్రధాన నిందితుడిగా ఉన్న పరుశరాం వాగ్మేర్ 2012లో ఆయన సొంత జిల్లా విజయపురాలో పాకిస్తాన్ జెండా ఎగురవేసి అక్కడ మతఘర్షణలకు కారణమయ్యాడు. ఈ క్రమంలోనే పరుశరాంను అత్యంత ధైర్యవంతుడిగా ప్రకటించి గౌరీ లంకేష్ హత్యకు స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. హత్యకు ముందు వాగ్మేర్కు బస్ ఛార్జీలకోసం, అతని తిండి కోసం రూ.3వేలు ఇచ్చి, హత్య జరిగిన నెలకు రూ.10వేలు చెల్లించినట్లు డైరీలో ఉంది.