ఎన్నో ఆశలతో వచ్చాం..వ్యవస్థను మార్చలేం: సర్వీసుకు గుడ్ బై చెప్పిన ఐఎఎస్ టాపర్!
Recommended Video
మంగళూరు: కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా డిప్యూటీ కమిషనర్ గా పనిచేస్తోన్న సీనియర్ ఐఎఎస్ అధికారి ఎస్ శశికాంత్ సెంథిల్ రాజీనామా చేశారు. అఖిల భారత సర్వీసుల నుంచి వైదొలగుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఓ లేఖ రాశారు. ఈ వ్యవస్థలో మార్పును తీసుకుని రావడం అసాధ్యమని భావించడం వల్లే తాను రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. వ్యవస్థను మార్చలేకపోయిన సమయంలో.. హోదాలో కొనసాగడం అనైతికమని తాను మనసా, వాచా భావిస్తున్నానని చెప్పారు. అనైతికత్వానికి పాల్పడటం తనకు ఇష్టం లేదని, అందువల్లే అఖిల భారత సర్వీసుల నుంచి వైదొలగుతున్నట్లు తెలిపారు. ఓ ఐఎఎస్ అధికారి తన సర్వీసుల నుంచి వైదొలగటం ఇది రెండోసారి.
వాహన తయారీ రంగానికి గడ్డు కాలం?: మారుతి సుజుకి బాటలో అశోక్ లేలాండ్
సివిల్ సర్వీసుకు గుడ్ బై చెప్పిన రెండో అధికారి..
ఇదివరకు కేరళకు చెందిన కన్నన్ గోపీనాథ్.. తన తన సర్వీసులకు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. శశికాంత్ రాజీనామా అంశాన్ని కర్ణాటక కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజకీయం చేస్తున్నారు. కేంద్రంలో భారతీయ జనతాపార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత దేశంలో వ్యవస్థలు ఎంత హీనంగా దిగజారాయో తెలియజేయడానికి కన్నన్ గోపీనాథ్, శశికాంత్ సెంథిల్ రాజీనామాలు ఓ నిలువెత్తు ఉదాహరణలని విమర్శించారు. భవిష్యత్తులో ఇంకెంత మంది తమ హోదాలు, పదవులను స్వచ్ఛందంగా కోల్పోవాల్సి వస్తుందని ప్రశ్నించారు. రాజీనామా నిర్ణయాన్ని వెల్లడించడానికి శశికాంత్ సెంథిల్ రాసిన లేఖ ప్రతిని కాంగ్రెస్ నాయకులు తమ అధికారిక ట్విట్టర్ లో పొందుపరిచారు.
2009 సివిల్స్ పరీక్షలో తొమ్మిదో ర్యాంకు
2009 బ్యాచ్ కర్ణాటక క్యాడర్ కు చెందిన శశికాంత్ సెంథిల్ జన్మత: తమిళుడు. తమిళనాడుకు చెందిన ఆయన మూడేళ్లుగా దక్షిణ కన్నడ జిల్లా డిప్యూటీ కమిషనర్ గా పనిచేస్తున్నారు. 2009న జరిగిన సివిల్ సర్వీస్ పరీక్షల్లో శశికాంత్ సెంథిల్ జాతీయ స్థాయిలో తొమ్మిదవ ర్యాంకును సాధించారు. విధి నిర్వహణలో నిక్కచ్చిగా ఉంటారనే పేరుంది. ముక్కుసూటిగా వ్యవహరిస్తారని, ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తల వంచరని చెబుతుంటారు. డైనమిక్ అధికారిగా ఆయన గురించి చెబుతుంటారు దక్షిణ కన్నడ ప్రజలు. ప్రత్యేకించి మున్సిపల్ పరిపాలనపై శశికాంత్ సెంథిల్ కు మంచి పట్టు ఉంది. పట్టణాలు, నగరాల అభివృద్ధి అంశాలపై ఆయన కొన్ని వ్యాసాలను సైతం రాశారు. జిల్లా డిప్యూటీ కమిషనర్ గా ఆయన విధి నిర్వహణ కూాడా మున్సిపాలిటీల అభివృద్ధి గురించే కావడం గమనార్హం.
వ్యవస్థలు విఫలం అయ్యాయి.. వ్యక్తులు తయారయ్యారు..
అలాంటి అధికారి తన ఉజ్వల భవిష్యత్తును వదులుకుని.. సర్వీసులకు గుడ్ బై చెప్పడం ప్రకంపనలు రేపింది. జాతి మౌలిక పునాదులు ప్రమాదంలో పడ్డాయని, సమీప భవిష్యత్తులో మరిన్ని కఠిన సవాళ్లు ఎదురు కావడం ఖాయమని ఆయన తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. వాటి నుంచి దేశాన్ని కాపాడటం సర్వీసులో ఉంటూ కష్టతరమని అన్నారు. అందుకే- ఓ ఐఎఎస్ అధికారిగా కాకుండా.. బయటి వ్యక్తిగా వ్యవస్థలో మార్పులను తీసుకుని రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. వ్యవస్థ విఫలమైన సందర్భంలో వ్యక్తులు తయారవుతారని, వారే దేశాన్ని శాసించే స్థాయికి చేరుకుంటారని అన్నారు. వ్యవస్థలు దారుణంగా విఫలం కావడాన్ని అత్యంత ప్రమాదకర దశగా ఆయన అభివర్ణించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ ఐఎఎస్ అధికారిగా వ్యవస్థను మార్చడం అసాధ్యమని, అలా భావించిన తరువాత కూడా అదే హోదాలో కొనసాగడం అనైతికమని చెప్పారు. అందుకే తాను సర్వీసుల నుంచి వైదొలగుతున్నట్లు వెల్లడించారు.