షాక్: నగ్నంగా డ్యాన్స్ చేయనందుకే ‘టాయ్లెట్ లోషన్’ తాగించారు
మలప్పురం/కోజికోడ్: దళిత విద్యార్థినికి టాయిలెట్ లోషన్ను బలవంతంగా తాగించిన ఘటనలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. కర్ణాటకలోని కలబుర్గిలోని కర్ణాటక నర్సింగ్ కాలేజీలో ఇటీవలే ఈ దారుణం వెలుగు చూసింది.
నగ్నంగా నృత్యం చేయడానికి నిరాకరించిందన్న కారణంగానే సదరు దళిత విద్యార్థినితో సీనియర్ విద్యార్థినులు బాత్రూమ్లు కడిగే స్పిరిట్ని తాగించారు. అక్కడితో ఆగకుండా.. ఆ దృశ్యాలను మొబైల్ ఫోన్లో రికార్డు చేసి పదేపదే చూస్తూ వికృతానందం పొందారు. అంతేగాక, ఆమెకు ఆస్పత్రిలో వైద్యం అందకుండా అడ్డుకొన్నారు.
ప్రస్తుతం ఆమెకు కేరళలోని కోజికోడ్ మెడికల్ కాలేజీలో చికిత్స అందిస్తున్నారు. కేరళలోని త్రిశూర్ జిల్లా ఇడప్పల్ ప్రాంతానికి చెందిన బాధితురాలు (19) చిన్నప్పుడే తండ్రిని కోల్పోయింది. తల్లి కూలిపనులు చేసి సంపాదించిన డబ్బులతో చదువుకొంటోంది. ఇటీవలే కర్ణాటకలోని నర్సింగ్ కాలేజీలో చేరింది. రెండు రోజుల క్రితం ఆమెను సీనియర్ విద్యార్థినులు కాలేజీలో వేధించారు.
ర్యాగింగ్ వికృత రూపం: బలవంతంగా టాయిలెట్ క్లీనింగ్ లోషన్ తాగించారు
ర్యాగింగ్ పేరిట దారుణంగా అవమానించారు. బట్టలు విప్పేసి నగ్నంగా తమ ఎదుట ఆడిపాడాలని ఒత్తిడి తెచ్చారు. ఆమె నిరాకరించడంతో తీవ్రంగా కొట్టారు. నేలపైకి నెట్టి చేతులు కాళ్లు బంధించారు. బాత్రూమ్లు కడిగే స్పిరిట్ని బలవంతంగా తాగించారు. అంతటితో ఆగకుండా, ఆ దృశ్యాలను మొబైల్లో బంధించి వారి మిత్రులకు షేర్ చేశారు.
స్పిరిట్ గొంతులో పడగానే బాధితురాలు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. అక్కడే ఉన్న విద్యార్థులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. దాడి చేసిన వారిపై కేసులు నమోదవుతాయనే కారణంగా.. కొంతమంది వైద్య విద్యార్థులు ఆస్పత్రి వర్గాలపై దౌర్జాన్యానికి పాల్పడ్డారు. ఆమె వస్తువులను బయట పడేసి, ఆస్పత్రి నుంచి గెంటేశారు.
కాలేజీ యాజమాన్యం కూడా ఆమె పట్ల జాలి చూపించలేదు. ర్యాగింగ్ను.. ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. కొద్దిమంది తోటి విద్యార్థుల సహాయంతో బాధితురాలు ఎలాగోలా బుధవారం కేరళ చేరుకుంది. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నదని కోజికోడ్లోని మెడికల్ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు.
దళిత విద్యార్థినిపై ఈ దారుణానికి పాల్పడిన కేరళకు చెందిన ఎనిమిది మంది విద్యార్థినులపై పోలీసులు కేసు నమోదు చేసి, ఇద్దరిని అరెస్ట్ చేశారు. కేరళ మంత్రి ఏకే బాలన్ మాట్లాడుతూ.. బాధిత దళిత విద్యార్థిని ఆరోగ్యం మెరుగయ్యే వరకు కేరళ ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని, నిందితులకు శిక్షపడేలా చూస్తామని అన్నారు.