యువతిపై నెలలపాటు టీచర్ రేప్: నగలతోపాటు వధువును ఎత్తుకెళ్లారు
మథుర: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మథుర జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ కోచింగ్ సెంటర్ నడిపిస్తున్న ఉపాధ్యాయుడు.. తన దగ్గరకు వచ్చే ఓ విద్యార్థినిపై కొన్ని నెలలుగా అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళితే.. ద్విరికేశ్ కాలనీలో నిందితుడు సచిన్ చౌదరి ఓ ప్రైవేట్ కోచింగ్ సెంటర్ను నిర్వహిస్తున్నాడు. అతని దగ్గరికి తరగతుల కోసం బాధితురాలు వెళ్లింది. ఆమెకు మాయమాటలు చెప్పిన నిందితుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.
ఆ తర్వాత ఆమెను తరచూ బెదిరింపులకు గురిచేస్తూ కొన్ని నెలలపాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. తన కూతురుకు మత్తు మందిచ్చి తొలిసారి అత్యాచారానికి పాల్పడ్డాడని, ఆ తర్వాత బెదిరింపులకు గురిచేస్తూ తరచూ అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలి తల్లి పోలీసులకు తెలిపింది.
అనారోగ్యంగా ఉండటంతో తన కూతురును ఆస్పత్రికి తీసుకెళ్లగా అసలు విషయం తెలిసిందని బాధిరాలి తల్లి ఫిర్యాదులో పేర్కొంది. తన కూతురుకు నిందితుడు గర్భస్రావమయ్యే మందులు ఇవ్వడం వల్లే అనారోగ్యానికి గురైనట్లు వైద్యులు తేల్చారని ఆమె తెలిపింది.
కాగా, బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడ్ని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని పోలీసులు తెలిపారు.
నగలతోపాటు పెళ్లి కూతురు అపహరణ
గుజరాత్-మధ్యప్రదేశ్ సరిహద్దుల్లో దొంగలు పెళ్లి బృందాన్ని దోచుకోవటంతోపాటు.. నవవధువును కూడా ఎత్తుకెళ్లారు. గుజరాత్ యువతికి మధ్యప్రదేశ్ యువకుడితో పెళ్లి జరిగింది.
పెళ్లి ముగించుకుని అర్ధరాత్రి వరుడి ఇంటికి బయలుదేరిన పెళ్లి బృందం.. రెండు రాష్ట్రాల సరిహద్దుల్లోకి రాగానే దోపిడి దొంగలు దాడిచేసి.. అందరినీ దోచుకున్నారు. ఆ దొంగల్లో కొందరిని.. పెళ్లి కూతురు గుర్తుపట్టి అరవటంతో.. ఆమెను కూడా తమతో ఎత్తుకెళ్లారు.