ఇంత ఓర్వలేని తనమా?: దళిత పెళ్లి కొడుకు గుర్రంపై ఎక్కాడని..
హర్యానాలోని ఛార్కీ దాద్రీ జిల్లా సంజార్వాస్ గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటన దేశంలో దళితులు ఎదుర్కొంటున్న వివక్షకి అద్దం పడుతోంది.
భివానీ: ఒక దళిత పెళ్లి కొడుకు పెళ్లి ఊరేగింపులో భాగంగా గుర్రంపై ఎక్కాడని అక్కడి అగ్రకులాలు ఆగ్రహించాయి. తీవ్ర ఆగ్రహావేశాలతో ఊగిపోతూ వారిపై దాడికి పాల్పడ్డాయి. హర్యానాలోని ఛార్కీ దాద్రీ జిల్లా సంజార్వాస్ గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటన దేశంలో దళితులు ఎదుర్కొంటున్న వివక్షకి అద్దం పడుతోంది.
సంజర్వాన్ గ్రామానికి చెందిన అమ్మాయితో సంజయ్ అనే యువకుడికి పెళ్లి కుదరడంతో.. పెళ్లిరోజు గుర్రంపై అతను వధువు ఇంటికి వచ్చాడు. అంతే.. విషయం తెలుసుకున్న స్థానికులు హుటాహుటిన అక్కడికి చేరుకుని వధూవరుల కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడ్డారు. ఘటనలో గాయపడినవారిని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.
గ్రామ సర్పంచ్ భర్త వికాస్ ఈ ఘటనను సమర్థించడం గమనార్హం. గ్రామంలో దళితులు గుర్రాలపై ఊరేగడానికి వీల్లేదని సర్పంచ్ భర్త చెప్పారు. ఘటనపై సంజయ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.