మాయావతి మార్క్ పాలిటిక్స్: ఈ సామాజిక వర్గం వారికే లోక్సభ ఎన్నికల్లో అత్యధిక టికెట్లు
లక్నో: సార్వత్రిక ఎన్నికలకు మరో కొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే అన్ని పార్టీలు యుద్ధానికి సమాయత్తమవుతున్నాయి. అయితే దేశవ్యాప్తంగా దృష్టి మాత్రం ఉత్తర్ప్రదేశ్పైనే ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రం అత్యధిక ఎంపీలను అందిస్తుంది. అంతేకాదు కేంద్రంలో కూడా ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సారి ఈక్వేషన్స్ చాలా ఆసక్తిగా మారాయి. యూపీలో సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్వాదీ పార్టీలు చేతులు కలపడంతో పొలిటికల్ ఈక్వేషన్స్ చాలా ఇంట్రస్టింగ్గా కనిపిస్తున్నాయి. పొత్తులో భాగంగా రెండు పార్టీలు చెరో 38 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. బీఎస్పీ అధినేత్రి మాయావతి ఇప్పటికే ఫుల్ క్లారిటీతో ఉన్నారు.
సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఉత్తర్ప్రదేశ్ సమీకరణాలపైనే దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. దళిత నాయకురాలైన మాయావతి ఈ సారి టికెట్ కేటాయింపుల్లో కాస్త ఆచితూచి వ్యవహరిస్తున్నారు. బీఎస్పీ కోటా కింద వచ్చే 38 స్థానాల్లో అత్యధికంగా బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారికే బెహన్జీ టికెట్ కేటాయించారు. టికెట్ కేటాయింపుల్లో మాయావతి తన చాణక్యాన్ని ప్రదర్శించారు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారికి టికెట్లు ఎక్కువగా కేటాయించడం వల్ల బీజేపీకి చెక్ పెట్టొచ్చనేది ఒక ఆలోచన కాగా... బ్రాహ్మణ ఓట్లు కాంగ్రెస్కు వెళ్లకుండా బీఎస్పీ వైపునకు పడుతాయనేది ఆమె ఆలోచన.
ఇప్పటికే బీఎస్పీకి కేటాయించిన 38 స్థానాలకు అభ్యర్థుల ఖరారు జరిగిపోయింది. 2007లో ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన ఎన్నికల్లో దళితులు-బ్రాహ్మణుల కాంబినేషన్ వర్కౌట్ అయి బీఎస్పీ విజయఢంకా మోగించి ప్రభుత్వంలోకి వచ్చింది. ఇప్పుడు అదే ఫార్ములాను లోక్సభ ఎన్నికల్లో కూడా అమలు చేయాలని భావిస్తున్నారు మాయావతి. ఇప్పటికే బీఎస్పీకి దళితులు, ముస్లింల మద్దతు ఉండగా... ఎస్పీకి ఓబీసీలు బ్రాహ్మణుల మద్దతు ఉంది. దీంతో బీజేపీ కాంగ్రెస్ పార్టీలతో పోలిస్తే మాయావతి పార్టీ బీఎస్పీ ఒకడుగు ఎత్తులోనే ఉంది. తూర్పు ఉత్తర్ప్రదేశ్లో బ్రాహ్మణులు ఠాకూర్ల మద్య డామినేషన్ కనిపిస్తుంది. 2014లో మోడీ మానియా ముందు ఎవరూ నిలవలేక పోయారు. ఈ సారి మాత్రం మాయావతి తిరిగి తన గ్రిప్లోకి తీసుకోవాలని భావిస్తున్నారు. ఒక్క తూర్పు ఉత్తర్ ప్రదేశ్ నుంచే బీఎస్పీ ఆరు మంది బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులను బరిలో దింపుతోంది.
ఇక టికెట్ కేటాయింపులకు సంబంధించి మాయావతి ఆదివారం పార్టీ సమన్వయకర్తలు, జోనల్ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు ఇతర పార్టీ కార్యనిర్వాహకులతో సమావేశమయ్యారు. మూడు గంటల పాటు చేసిన ప్రసంగంలో మాయావతి పార్టీని రెండు జోన్ల కింద విభజించారు. ఒక్కో సమన్వయకర్తకు మూడు డివిజన్లు కేటాయించారు. కాంగ్రెస్ కూడా తన దృష్టంతా తూర్పు ఉత్తర్ప్రదేశ్పైనే సారించింది. ఎందుకంటే అక్కడే బ్రాహ్మణ ఓట్లు కాంగ్రెస్కు వస్తాయనేది ఆ పార్టీ నమ్మకంగా ఉంది.