రాజ్యసభాపక్షనేతగా దళిత నేత... కేంద్రమంత్రి థవార్చంద్ గెహ్లాట్కు దక్కిన అవకాశం
ఢిల్లీ: రాజ్యసభలో తమ నేతగా బీజేపీ దళిత నేత కేంద్రమంత్రి థవార్చంద్ గెహ్లాట్ను ఎంపిక చేసింది. తొలిసారిగా ఓ దళితుడిని రాజ్యసభ లీడర్గా ఎంపిక చేసింది బీజేపీ. దళిత వ్యతిరేకి అనే ముద్ర చెరిపివేసుకునేందుకే ఆ పార్టీ ఈ పద్దతికి శ్రీకారం చుట్టిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతకుముందు రాజ్యసభాపక్షనేతగా అరుణ్ జైట్లీ ఉండేవారు. అయితే జైట్లీకి ఆరోగ్యం బాగలేకపోవడంతో ఆయన స్థానాన్ని కేంద్రమంత్రి థవార్చంద్ గెహ్లాట్తో భర్తీ చేశారు.
గెహ్లాట్ సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిగా మోడీ కేబినెట్లో బాధ్యతలు స్వీకరించారు. అంతేకాదు కిందటి మోడీ సర్కార్లో కూడా కేంద్రమంత్రిగా పనిచేశారు. రాజ్యసభ, లోక్సభలో పనిచేసిన అనుభవం గెహ్లాట్కు ఉంది. ఇక బుధవారం బీజీపీ పార్లమెంటరీ పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీని కొత్తగా నియమించింది. ఈ నియామకాలు ప్రధాని మోడీ ఆదేశాల మేరకు జరిగాయి. ఇక లోక్సభపక్ష డిప్యూటీనేతగా రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను పార్టీ నియమించింది. రాజ్యసభాపక్ష డిప్యూటీ నేతగా రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ను నియమించింది.
బీజేపీ సామాజకి సమానత్వాన్ని పాటిస్తుందని చెప్పడానికి ఒక దళిత నేతను రాజ్యసభపక్షనేతగా ఎంపికచేయడమే నిదర్శనమని ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. ఇది ఒక చారిత్రాత్మకమైన నిర్ణయమని ఆయన అన్నారు. అంతేకాదు పార్టీలో ప్రభుత్వంలో దళితులకు సరైన గౌరవం దక్కుతుందని ఆయన చెప్పారు.
ఇక బీజేపీ దళిత ఓటు బ్యాంకుపై కన్నేసినట్లు సమాచారం. ఉత్తర్ప్రదేశ్లో పెద్దఎత్తున్న దళితులు పార్టీకి ఓటు వేయడంతోనే 80లోక్సభ స్థానాలకు బీజేపీ 62 లోక్సభ స్థానాలను కైవసం చేసుకోగలిగింది. గతంలో దళితులు చాలావరకు నిరసనలు చేపట్టారని దీన్నే అదనుగా తీసుకున్న విపక్షాలు ఏదో చేయాలని భావించి చతికిలపడ్డాయని బీజేపీ నేత అన్నారు. అయితే బీజేపీ ప్రభుత్వం దళితులకు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలతో వారి మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకుందని చెప్పారు. అదే ఈ రోజు ఉత్తర్ప్రదేశ్ ఫలితాలతో స్పష్టమైందన్నారు.