బైకుతో పొరపాటున ఢీకొన్నందుకు యువకుడిపై సామూహిక దాడి, మృతి
జైపూర్: రాజస్థాన్లో దారుణం చోటుచేసుకుంది. బైకుపై నియంత్రణ కోల్పోయి ఓ మహిళను ఢీకొన్నడని దళిత యువకుడిని స్థానికులు కొట్టి చంపారు. పట్టపగలే జరిగిన ఈ ఘటన అల్వార్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... దళిత సామాజిక వర్గానికి చెందిన 28 ఏళ్ల హరీష్ జాతవ్ జిరానా గ్రామంను తన మోటారు బైకుపై దాటుతుండగా ఓ మహిళను ఢీకొన్నాడు. మహిళ కిందకు పడిపోవడంతో స్థానికులు పరుగులు తీసి జాతవ్ను పట్టుకుని చితకబాదారు.
స్థానికులు విచక్షణ కోల్పోయి చితకబాదడంతో రక్తపు మడుగులో పడిపోయాడు హరీష్. తీవ్రగాయాలు పాలై స్పృహ కోల్పోయిన హరీష్ను స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. ఆ తర్వాత ఢిల్లీలోని సఫ్దార్జంగ్ ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడికి తీసుకెళ్లే సరికే హరీష్ మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు. హరీష్ మృతదేహంను పోస్టుమార్టంకు తరలించారు. ఘటనకు సంబంధించి చోపంకి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తమకు న్యాయం చేయాల్సిందిగా హరీష్ తండ్రి రోధించాడు.
ఇక హరీష్ పై దాడిచేసిన స్థానికులు అతను రక్తపు మడుగులో పడి ఉండటాన్ని చూసి వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అక్కడ రోడ్డు ప్రమాదం జరిగిందని పోలీసులకు చెప్పారు. అయితే ఫిర్యాదు చేసిన వారే హరీష్పై దాడి చేశారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం వారంతా పరారీలో ఉన్నట్లు చెప్పిన పోలీసులు వారికోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలోనే అల్వారులో గోవులను అక్రమ రవాణా చేస్తున్నారన్న ఆరోపణలపై ఓ వ్యక్తిని గోసంరక్షకులు అని చెప్పుకునేవారు చితకబాదిన సంగతి తెలిసిందే.