దళితుడి శవం.. అగ్రవర్ణాల ఆధిపత్యం.. ఇదెక్కడి కులపిచ్చిరా నాయనా..! (వీడియో)
Recommended Video
చెన్నై : తమిళనాడులో జరిగిన ఘటన చూస్తే ఇదెక్కడి కుల పిచ్చిరా నాయనా అనుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. పుట్టుక నుంచి చావు దాకా కులం కులం అంటూ గొంతు చించుకునే అగ్రవర్ణాల పైత్యం మరోసారి బయటపడింది. అభివృద్ధి చెందని నాటి నుంచి టెక్నాలజీతో పరుగులు పెడుతున్న ఈ కాలంలోనూ కులజాఢ్యం ముసుగులో కొందరు రెచ్చిపోతున్నారు. ప్రాణం పోసుకుని భూమ్మీదకు వచ్చిన దగ్గర్నుంచి వెంటాడిన కులం చివరకు ఓ దళితుడు చనిపోయాక కూడా అతడిని వెంటాడిన ఘటన సభ్యసమాజం తలదించుకునేలా ఉంది.
అగ్రవర్ణాల ఆధిపత్యం.. మృతదేహం తరలింపులో రాజకీయం..!
దళితులంటే చిన్నచూపు. నాటి నుంచి నేటి వరకు అదే తంతు. అగ్రవర్ణాల ఆధిపత్యానికి బలవుతూ ప్రతి నిత్యం అవమానాల బారిన పడాల్సిన దుస్థితి. దళితులంటే చాలు అదో రకంగా చూసే అగ్రవర్ణం పెద్దలని చెప్పుకునే గద్దలు రాక్షసంగా ప్రవర్తిస్తున్న ఘటనలు ప్రతి రోజూ ఏదో చోట వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా తమిళనాడు రాష్ట్రంలోని వెల్లూరు ప్రాంతంలో జరిగిన ఘటన చర్చానీయాంశమైంది. దళితుడి శవ యాత్రను కూడా రాజకీయం చేయాలని చూసిన అగ్రవర్ణాల పైత్యం బయటపడింది.
ప్రాణం పోయిన వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించే సమయంలోనూ అగ్రవర్ణాల పెద్దలు ప్రవర్తించిన తీరు సభ్యసమాజం తలదించుకునేలా ఉంది. ఈ అమానవీయ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దేశవ్యాప్త చర్చకు దారి తీసింది.
తమ పొలాల్లో నుంచి శవయాత్ర వెళ్లొద్దంటూ..!
కులం కారణంగా దళితులను తీవ్రంగా అవమానించిన అమానుష ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. వెల్లూరుకు చెందిన కుప్పన్ అనే వ్యక్తి దళిత కులానికి చెందినవారు. ఆయన అనారోగ్య కారణాలతో చనిపోయారు. అయితే బంధవులు, కులస్థులతో పాటు కొందరు గ్రామస్తులు అంత్యక్రియలు నిర్వహించడానికి సిద్ధమయ్యారు. అదే క్రమంలో అగ్రవర్ణాల పైత్యం బయటపడింది.
అగ్రవర్ణాల కులాలకు చెందిన కొందరు పెద్దలు దళితుడి శవయాత్రను అడ్డుకున్నారు. అంత్యక్రియలకు తీసుకెళుతున్న సందర్భంలో అడ్డుపడ్డారు. ఊహించని ఘటనతో శవయాత్రలో ఉన్న దళిత కులస్థులు, గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. చనిపోయిన వ్యక్తి ఆత్మ శాంతించకుండా ఇదేంటని అనుకున్నారే తప్ప ఎవరూ ఎదిరించలేని పరిస్థితి.
బ్రిడ్జి పై నుంచి మృతదేహం కిందకు దించి.. అంతిమ సంస్కారాలు..!
దళిత వ్యక్తి శవయాత్రను అగ్రవర్ణాల పెద్దలు అడ్డుకోవడం స్థానికంగా చర్చానీయాంశమైంది. శవయాత్ర తమ పొలాల మీదుగా వెళ్లద్దొనేది వారి డిమాండ్. ఎట్టిపరిస్థితుల్లో కుప్పన్ మృతదేహాన్ని తమ పొలాల నుంచి తీసుకెళ్లొద్దని అల్టిమేటం ఇచ్చారు. దాంతో ఏమీ చేయాలో తెలియక శవయాత్రలో పాల్గొన్నవారు చివరకు దారిలో ఉన్న బ్రిడ్జి పైనుంచి కుప్పన్ మృతదేహాన్ని జాగ్రత్తగా కిందకు దించి ఇతర మార్గంలో దహన సంస్కారాలకు సిద్ధమయ్యారు.
కుల పట్టింపులతో శవయాత్రను అడ్డుకున్న ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాంతో రాకెట్ యుగంలోనూ ఈ కులపిచ్చి ఏంటిరా నాయనా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.